చింతామణి: పిడుగు శబ్దానికి యువకుడు మృతి చెందిన ఘటన తాలూకాలలోని దిగువగొల్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గురువారం రాత్రి గ్రామంలో వర్షం కురుస్తుండగా వినయ్(15) అనే బాలుడు గొడుగు సహాయంతో బయటకు వెళ్లాడు. ఆ సమయంలో పెద్ద శబ్దంతో ఉరుములు, మెరుపులు రావడంతో వినయ్ తీవ్ర భయాందోళనకు గురై అక్కడికక్కడే మరణించాడు. ఇంటికి రావకపోవడంతో తల్లిదండ్రులు వెళ్లి చూడగా విగతజీవిగా కనిపించాడు.
బదిలీల్లో సీఎం
కార్యాలయ జోక్యం
● ప్రశ్నించిన హైకోర్టు
శివాజీనగర: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల్లో ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యం చేసుకోవటాన్ని హైకోర్టు తీవ్రంగా ప్రశ్నించింది. సీఎం కార్యాలయం నుంచి బదిలీ విషయమై బెస్కాం అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ) చేతన్ ఎస్ సమర్పించిన పిటిషన్పై శుక్రవారం విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తులు డీకే సింగ్, టీఎం నదాఫ్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం గ్రూప్ బీ, సీ ఉద్యోగుల బదిలీ విషయంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. సీఎం సిద్ధరామయ్యకు ఉద్యోగుల బదిలీ కంటే చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి, ప్రభుత్వ ఉద్యోగుల బదిలీ విషయం ఆయా శాఖలకు వదిలిపెట్టాలి, ముఖ్యమంత్రి కార్యాలయం బదిలీ విన్నపాన్ని స్వీకరించరాదని సూచించింది. ఈ ఆదేశాల కాపీని ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించాలని హైకోర్టు సూచించింది. సీఎం కార్యాలయం చేసే బదిలీ సిఫార్సులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి కూడా వివరణ కోరింది. దీనిపై స్పందించిన ప్రధాన కార్యదర్శి..సీఎం కార్యాలయం నుంచి ఇచ్చే నోటీసులు కేవలం సిఫార్సులు కాగా.. తుది ఆదేశాన్ని సదరు శాఖ ఇస్తుందని పేర్కొన్నారు.
సీఎంను నిలదీసిన మంత్రి
ఇంధన శాఖలో కొంతమంది అధికారులను బదిలీ చేసేందుకు సీఎం కార్యాలయం సిద్ధమైంది. సీఎం కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య ఇంధన శాఖ పాలనా వ్యవహారాల్లో తీవ్రంగా జోక్యం చేసుకుంటున్నారు. దీంతో అసంతృప్తికి గురైన మంత్రి కేజే జార్జ్ సీఎం ఇంటికి వెళ్లి ప్రశ్నించారు. అంతేకాకుండా రాజీనామా విషయంపైనా ప్రతిపాదించారు. అయితే సీఎం సిద్ధరామయ్య మంత్రికి నచ్చజెప్పారు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి కారణమైంది. సీఎం కుమారుడు ఇలా అన్ని శాఖల్లో జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపించాయి. మరొక వైపు ఇంధన శాఖ అధికారుల బదిలీ విషయంలోనూ సీఎం కార్యాలయం పాత్రపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ పరిణామాలన్నింటి మధ్య హైకోర్టు చేసిన ఈ తీవ్ర సూచన రాష్ట్ర రాజకీయాల్లో మరింత చర్చకు కారణమైంది.
నందిని ఉత్పత్తులకూ గ్యాస్ సెగ
శివాజీనగర: కన్నడిగుల గర్వకారణ బ్రాండ్ కేఎంఎఫ్ ప్రస్తుతం తీవ్ర గ్యాస్ ఇబ్బందిని ఎదుర్కొంటోంది. అంతర్జాతీయ ఉద్రిక్తతల కారణంగా నెలకొన్న ఇంధన కొరత ప్రస్తుతం నందిని ఉత్పత్తులపై నేరుగా పరిణామం చూపుతోంది. నందిని ఉత్పత్తులు మరో రెండు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఆ తరువాత కొరత ఎదురయ్యే అవకాశముంది. ఇందుకు కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల తీవ్ర కొరత ప్రధాన కారణం. ప్రతి నెల సుమారు 450 కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్లపై ఆధారపడిన కేఎంఎఫ్కు గత కొన్ని రోజుల నుంచి ఏ ఒక్క సిలిండర్ కూడా సరఫరా కాకపోవడంతో ఇబ్బందులకు గురైంది. ప్రస్తుతం ఉన్న స్టాక్ కేవలం రెండు రోజులకు మాత్రం సరిపోతుందని అఽధికారులు తెలిపారు.
సిలిండర్లు సరఫరా కాకుంటే ముప్పే
శనివారంలోగా ఎల్పీజీ సిలిండర్లు సరఫరా కాకపోతే నందిని స్వీట్స్, కార ఆహార ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయే ముప్పు పొంచి ఉంది. కేఎంఎఫ్ ఇప్పటికే ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అత్యవసర చర్యలు తీసుకోవాలని విన్నవించింది. సిలిండర్ల కొరతతో ఇప్పటికే రాజధానిలో హోటళ్లు కూడా బంద్ అవుతున్న నేపథ్యంలో కేఎంఎఫ్పై ఒత్తిడి మరింత అధికమైంది.


