బొమ్మనహళ్లి: ప్రవాసాంధ్రులు పెద్ద సంఖ్యలో నివాసం ఉండే బెంగళూరు నగరంలోని యలహంకలో శ్రీ తొగటవీర క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో శ్రీచౌడేశ్వరీ దేవి జ్యోతుల ఉత్సవం గురువారం నేత్రపర్వంగా సాగింది. ఉదయం 8 గంటలకు కలశ పూజ నిర్వహించిన అనంతరం యలహంక పురవీధుల్లో పొద్దుటూరు బ్యాండ్ సెట్ మధ్య కలశాలను ఊరేగించారు. సాయంత్రం 7గంటలకు ఆలయంలో జ్యోతులు వెలిగించగా అగ్నిగుండం ప్రవేశం చేసి చౌడేశ్వరి దేవి ఉత్సవ మూర్తిని పూల పల్లకిలో ప్రతిష్టాపన చేశారు. యలహంక ప్రముఖ వీధుల్లో భారీ ఊరేగింపు నిర్వహించారు. కుల గురువు శ్రీశ్రీ దివ్వ జ్ఞానానందగిరి స్వామీజీ, యలహంక ఎమ్మెల్యే ఎస్.ఆర్.విశ్వనాథ్ దంపతులు, చిక్కబళ్లాపుర ఎంపీ డాక్టర్ సుధాకర్ పాల్గొని పూజలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.


