శివాజీనగర/సాక్షి,బళ్లారి: దావణగెరె దక్షిణ నియోజకవర్గం నుంచి బీజేపీకి అభ్యర్థి శ్రీనివాస్ టీ.దాస్ కరియప్ప శుక్రవారం తమ నామినేషన్ దాఖలు చేశారు. దావణగెరె దక్షిణ నియోజకవర్గం నుంచి అనూహ్య పరిణామాల మధ్య టికెట్ దక్కించుకున్న శ్రీనివాస్ తన మద్దతుదారులతో కలిసి దావణగెరెలో అట్టహాసంగా నామినేషన్ వేశారు. నామినేషన్ అనంతరం ఆయన మాట్లాడుతూ టికెట్కు తనతో పాటు అజయ్ కుమార్, వినయ్కుమార్ పోటీ పడినా పార్టీ అధినాయకత్వం తనకే టికెట్ కేటాయించిందన్నారు. టికెట్ దక్కని వారు కూడా అందరూ కలిసికట్టుగా ఎన్నికల్లో తన గెలుపునకు సహకరిస్తారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ కేటాయించినా గెలుపు మాత్రం తనదేనని అన్నారు. ఈ నియోజకవర్గంలో బీ.ఫాం లేకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన దివంగత ఎమ్మెల్యే శ్యామనూరు శివశంకరప్ప మనవడు, మంత్రి ఎస్.ఎస్.మల్లికార్జున్, లోక్సభ సభ్యురాలు ప్రభా మల్లికార్జున్ కుమారుడు సమర్థ్ మల్లికార్జున్ కూడా బీ.ఫాం లేకుండా మంచి రోజైన శుక్రవారం తన తల్లిదండ్రులు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్ఎస్ మల్లికార్జున, పార్టీ ఇతర నాయకులు, మద్దతుదారులతో కలిసి వచ్చి తన నామినేషన్ సమర్పించారు. అనంతరం సమర్థ్ మాట్లాడుతూ తన తాత శ్యామనూరు శివశంకరప్ప మృతితో ఖాళీ అయిన స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ తనకు కచ్చితంగా లభిస్తుందనే విశ్వాసంతో నామినేషన్ వేశానన్నారు. గురువారం న్యూఢిల్లీలో ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నేతృత్వంలో జరిగిన కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో దావణగెరె దక్షిణ నియోజకవర్గం నుంచి శ్రీనివాస్ దాస్ కరియప్ప, బాగల్కోటె నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే వీరణ్ణ చరంతిమఠను అభ్యర్థులుగా ఎంపిక చేశారు. కాగా బాగలకోటె నియోజకవర్గం నుంచి శుక్రవారం బీజేపీ అభ్యర్థి వీరణ్ణ చరంతిమఠ నామినేషన్ వేశారు. కాంగ్రెస్ టికెట్ ఆశించిన గోవింద బళ్లారి కూడా బీ ఫాం లేకుండానే నామినేషన్ సమర్పించారు.
దావణగెరెలో రెండు
బాగల్కోటెలో రెండు


