● పంచాంగ శ్రవణ కర్త మఠం గురుప్రసాద్
సాక్షి, బళ్లారి: తెలుగు, కన్నడిగులు నూతన సంవత్సంగా భావించే ఉగాది పండుగ నుంచే కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఈ ఏడాదికి పరాభవ సంవత్సరం అని పేరు రావడంతో ఎలాంటి భయాందోళన అవసరం లేదని ప్రముఖ జ్యోతిష్య పండితుడు మఠం గురు ప్రసాద్ తెలిపారు. గురువారం ఉగాది పర్వదినం సందర్భంగా నగరంలోని అనంతపురం రోడ్డులోని వెలసిన అయ్యప్ప స్వామి ఆలయం, శ్రీకనక దుర్గమ్మ ఆలయం వద్ద పంచాంగ శ్రవణం వినిపించారు. ఈ ఏడాది పాటు జరగబోయే ముఖ్యమైన ఘటనలను వివరించారు. పరాభవనామ సంవత్సరంలో రాజు అంటే గురువు, మంత్రి కుజుడు ఉన్నారన్నారు. గురువు రాజు అయినందున దేశభక్తి పెరుగుతుందన్నారు. భారత్ రక్షణ వ్యవస్థ మరింత పటిష్టంగా తయారవుతుందని తెలిపారు. దేవాయాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. నాయకులు, అధికారులు కూడా మంచి మార్గంలో నడుస్తారని జోస్యం చెప్పారు. యుద్ధాల వల్ల దేశాలకు నష్టం జరుగుతుందన్నారు. పాకిస్థాన్ తాను తీసుకున్న గుంతలో తానే అంతర కలహాలతో కొట్టుమిట్టాడుతుందన్నారు. రైతులకు మంచి జరుగుతుందని.. పంటలు బాగా పండుతాయని వెల్లడించారు. కార్యక్రమంలో కమ్మరచేడు కళ్యాణస్వామి, మేయర్ గాదెప్ప, శబరిమలై అయ్యప్ప ట్రస్టు, జిల్లా ఆర్యవైశ్య సంఽఘం ప్రముఖులు జయప్రకాష్ గుప్తా, బళ్లారి కల్చరల్ అక్టివిటిస్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు శీలాబ్రహ్మయ్య, జిల్లా జేడీఎస్ అధ్యక్షుడు మీనళ్లి తాయణ్ణ, మాజీ బుడా అధ్యక్షుడు మారుతీ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.


