శివాజీనగర: సిలికాన్ సిటీకి ఇతర రాష్ట్రాల నుంచి చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు తదితరాల కోసం దేశం నలుమూలల నుంచి జనం రాక ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోవడంతో ఇళ్లకు, స్థలాలకు అంతులేని డిమాండు ఏర్పడింది. ఫలితంగా బాడుగలు సామాన్యలు భరించలేని స్థాయికి చేరాయి. చిన్న హాల్ ఉన్న ఇంటికి కూడా రూ.10 వేలు బాడుగు అడుగుతున్నారు. ఇళ్లను వెతికిచ్చే బ్రోకర్లకు కమీషన్ కూడా ఎక్కువే. ఈ బాధలను ఓ టెక్కీ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. చాలామంది నెటిజన్లు తమకూ ఇలాంటి సమస్యే ఉందని వాపోయారు.
ఎంత తిరిగినా అంతే
టెక్కీ తన బాధను బెంగళూరు హౌస్ రెంటల్ అనే ఖాతాలో పోస్ట్ చేశారు. ‘ఎంజీ రోడ్డు చుట్టుపక్కల ఇంటిని వెతికాను. గతంలో మూడేళ్లు ఎలక్ట్రానిక్ సిటీలో ఉండే కంపెనీలో పనిచేసి, ఇప్పుడు ఎంజీ రోడ్డు వద్ద ఉన్న సంస్థలో చేరాను. బెంగళూరులో చల్లని వాతావరణంలో హాయిగా ఉంది. ఇందిరానగర, దొమ్మలూరు, విక్టోరియా లేఔట్, ఫ్రేజర్టౌన్, రిచ్మండ్ టౌన్లో తిరిగాను. సాధారణ అద్దెకు ఒక్క గది కూడా దొరకలేదు. రూ.8 వేలు చెల్లించి బ్రోకర్ల సాయం కోరాను. కొన్ని చిన్న ఇళ్లు కాగా, మరికొన్ని ఇళ్ల వాతావరణం సరిగా ఉండేది కాదు. ఫిబ్రవరి ముగిసి మార్చి ఆరంభమైనా కూడా నాకు ఇల్లు లభించలేదు. ఒకసారి ఒక బ్రోకర్ దొమ్మలూరులో రూ.26 వేల ఇల్లును చూపించాడు. మరుసటి వెళ్లి చూడగా అప్పటికే ఫ్లాట్ను మరొకరు కొనుగోలు చేసినట్లు అక్కడి ప్రజలు తెలిపారు. నాలో ఓర్పు నశించింది. సమయం, సొమ్ము అన్ని వృథా అయ్యాయి. ఈ ఉద్యోగమూ వద్దు, ఇల్లూ వద్దు అనుకున్నా’ అని రాసుకున్నాడు.
సలహాలు, స్పందనలు
నెట్లో పలు రకాలుగా స్పందించారు. మల్లేశ్వరం, రాజాజీనగర, శేషాద్రిపురంలో వెతకాలని ఒకరు సలహానిచ్చారు. జనవరి నుంచి నేను కూడా ఇల్లు వెతుకుతున్నా, ఇప్పటికీ దొరకలేదని మరొకరు తెలిపారు. బెంగళూరులో బాడుగలను భరించలేమని ఎక్కువమంది చెప్పారు.
ఇల్లు దొరక్క ఉద్యోగమే
మానేయాలనుకున్నా
సోషల్ మీడియాలో టెక్కీ ఆక్రోశం


