● రైతు సంఘం నేత మృతి
● కోలారు వద్ద దుర్ఘటన
కోలారు: కారు చెరువులోకి పడిన ప్రమాదంలో కర్ణాటక ప్రాంత రైతు సంఘం (కెపిఆర్ఎస్) జిల్లా అధ్యక్షుడు టిఎం వెంకటేష్ మరణించారు. శనివారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో తాలూకాలోని ముదువాడి చెరువులో చోటు చేసుకుంది. కమ్యూనిస్టు, రైతు సంఘాల నేత అయిన టిఎం వెంకటేష్ (45), ఆదివారం నుంచి కోలారులో జరిగే 3 రోజుల కెపిఆర్ఎస్ రాష్ట్ర సమ్మేళనం ఏర్పాట్లను చూసి, కారులో ఒక్కరే బయల్దేరారు. కారు ముదువాడి చెరువు రోడ్డులో వెళ్తుండగా వెంకటేష్ నిద్రమత్తులో అదుపు తప్పి చెరువులోకి దూసుకుపోయినట్లు అనుమానాలున్నాయి.
ఆదివారం ఉదయం చెరువులో కారు తేలుతుండడం చూసి గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఈలోగా రైతు సంఘాల నాయకులు, పోలీసులు చేరుకుని కారును బయటకు తీయగా లోపల మృతదేహం కనిపించింది. కోలారు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నేతలు, కార్యకర్తలు తీవ్ర విషాదానికి లోనయ్యారు.
ఇద్దరు దొంగల అరెస్టు
మైసూరు: జిల్లాలోని నంజనగూడు తాలూకాలోని కవలందె గ్రామంలో ఒక ఇంట్లో దొంగతనం చేసిన ఇద్దరు దొంగలను అరెస్టు చేశారు. తగడూర్ గ్రామానికి చెందిన టి.బి.రాజు, టి.డి. అభిషేక్ నిందితులు, వారి నుంచి రూ.2.28 లక్షల నగదు, 22 గ్రాముల బంగారు ఆభరణాలను సీజ్ చేశారు. ఫిబ్రవరి 16న తగడూరులో ఓ మహిళ ఇంట్లోకి చొరబడిన నిందితులు ఆమెను బెదిరించి 22 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.2.28 లక్షల నగదును దోచుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేసి దొంగలను పట్టుకున్నారు.
డీకే శ్రీనివాస్కు హైకోర్టులో బెయిలు
యశవంతపుర: వ్యాపారవేత్త కె.రఘునాథ్ అనుమానాస్పద మృతి, అతని ఆస్తులను బలవంతంగా బదిలీ చేసుకున్న కేసుల్లో జైలుపాలైన డీకే ఆది కేశవులనాయుడు కుమారుడు డీకే శ్రీనివాస్కు కర్ణాటక హైకోర్టు షరతులతో బెయిల్ను మంజూరు చేసింది. ఈ కేసుల్లో అతనిని సీబీఐ ఇటీవల అరెస్టు చేయడం తెలిసిందే. రెండు నెలల నుంచి కారాగారంలో ఉంటున్నాడు.
బెయిలుకు మంజూరు చేసుకోగా, న్యాయమూర్తి జస్టిస్ శివశంకర్ అమరణ్ణవర్ ధర్మాసనం విచారించి, వాదనల తరువాత బెయిలును మంజూరు చేసింది. పోలీసుల విచారణకు సహకరించాలని, వారం రోజుల లోపు పాస్పోర్టును కోర్టుకు అప్పగించాలని, విచారణ నివేదిక వచ్చే వరకు కర్ణాటకను వదలి వెళ్లరాదని షరతులను విధించింది.


