హైకోర్టులో నిందితుల అర్జీ
యశవంతపుర: చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో ముగ్గురు నిందితులు కోర్టులో పిటిషన్లను దాఖలు చేశారు. తమ మొబైల్ఫోన్లను కామాక్షిపాళ్య పోలీసులు హత్యాస్థలంలోనే స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు, ఇది నిజం కాదు, వేరేచోట స్వాధీనం చేసుకొని అలా చెబుతున్నారు అని హైకోర్టులో అర్జీ వేశారు. ఫోటోల్లో కనిపిస్తున్న తేడాలే దీనికి నిదర్శనమని, కేసును దారి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఈ కేసు తారుమారు కాకుండా హైకోర్టు జాగ్రత్తలు వహించాలని కోరారు. అర్జీలను విచారించిన న్యాయమూర్తి కేసు సీసీ కెమెరాల చిత్రాలు నాశనం చేయకుండా చూసుకోవాలని పోలీసులకు సూచనలు చేశారు.
రణవీర్సింగ్..
ఇది తగునా?
● హైకోర్టు వ్యాఖ్యలు
బనశంకరి: కాంతారా చాప్టర్–1 సినిమా గురించి మాట్లాడుతూ దేవుళ్లను కించపరిచేలా ప్రవర్తించారని ప్రముఖ బాలీవుడు నటుడు రణవీర్సింగ్పై బెంగళూరు హైగ్రౌండ్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు కాగా, దానిని కొట్టివేయాలని ఆయన న్యాయవాదులు హైకోర్టులో కేసు దాఖలు చేశారు. మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ ఎం.నాగప్రసన్న విచారణ చేపట్టారు. రణవీర్సింగ్ జరిగిన పొరపాటును సరిదిద్దడానికి సిద్ధమని, క్షమాపణ కూడా చెప్పారని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. జడ్జి స్పందిస్తూ, దేవత చావుండి పాత్రలో రిషబ్శెట్టి నటించారు. ప్రజల భక్తి భావాల గురించి రణవీర్సింగ్ కు తెలియకపోవచ్చు. మహిళా దెయ్యం అని మిమిక్రీ చేశారు. ఇది ప్రజల మనోభావాలకు భంగం కలిగే విషయం. రణవీర్సింగ్ కానీ, ఇతరులు కానీ అలా వ్యవహరించరాదు అని స్పష్టంచేశారు. కేసు విచారణకు ఆయన సహకరించాలి, అలాగే రణవీర్సింగ్ పై పోలీసులు బలవంతపు చర్యలు తీసుకోవద్దు అని ఆదేశిస్తూ మార్చి 2కు విచారణను వాయిదా వేశారు.


