ఘటప్రభ నదిలో నీటి కోసం పశువుల దైన్య స్థితి
ఎండిపోయిన మలప్రభ నది
దేవసూగూరు వద్ద నీరు లేని కృష్ణా నది
రాయచూరు రూరల్: రాష్ట్రంలో గతేడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ప్రధాన జలాశయాలు నీళ్లు లేక వెలవెలబోతున్నాయి. మార్చి నెలాఖరు నాటికి భారీ, మధ్య తరహా నీటి వనరులు ఎండిపోయాయి. ఈ ఏడాది వేసవి ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నాయి. ఏప్రిల్, మే నెలలో దాహం కేకలు మరింత పెరగనున్నాయి. మలప్రభ, ఘటప్రభ, తుంగభద్ర, కృష్ణా నదుల్లో ప్రవాహం మందగించగా.. ఆయా నదులపై నిర్మించిన జలాశయాల్లో నీటి నిల్వలు కనిష్ట స్థాయికి దిగజారాయి. దీంతో ఉత్తర కర్ణాటక, కళ్యాణ కర్ణాటకలో జల క్షామంతో మంచినీటి ఎద్దడి నెలకొనే పరిస్థితి ఏర్పడింది. విజయపుర జిల్లాలోని ఆల్మట్టి డ్యాంలో ఆశించినంత స్థాయిలో నీటి నిల్వ అందుబాటులో లేదని తెలుస్తోంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది జలాశయంలో నీటి నిల్వ తక్కువగా ఉంది.
ఆల్మట్టి డ్యాంలో అడుగంటిన నీటి నిల్వలు
డ్యాం గరిష్ట స్థాయి నీటిమట్టం 519.60 మీటర్లు, నీటి నిల్వ 123.081 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటిమట్టం 490.70 మీటర్లు, నీటి నిల్వ 32.400 టీఎంసీలు మాత్రమే ఉంది. డ్యాం డెడ్ స్టోరేజీ 10.600 టీఎంసీలు కాగా మిగిలిన 21.800 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. కళ్యాణ కర్ణాటక పరిధిలోని బీదర్, కలబుర్గి, యాదగిరి, రాయచూరు, కొప్పళ, ఉత్తర కర్ణాటకలోని ధార్వాడ, బెళగావి, బాగల్కోటె, గదగ్ జిల్లాల్లో తాగునీటి పథకాలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. గతంలో వానలు కురువక పోవడంతో కళ్యాణ కర్ణాటకలో తీవ్రమైన తాగునీటి ఎద్దడి నెలకొంది. కలబుర్గి జిల్లాలో ఘటప్రభ, మలప్రభ, బెణ్ణెతోర, అమర్జా, భీమా నదులున్నా తాగునీటికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. రాయచూరు జిల్లాలో లింగసూగూరు తాలూకా యరగుంట, సింధనూరు తాలూకా మల్లనగుడ్డలకు ట్యాంకర్తో నీటి సరఫరా చేపడుతున్నారు.
15 జిల్లాల్లో నీటి కొరత
పట్టించుకోని ప్రభుత్వం
మౌనం దాల్చిన మంత్రులు


