కళాకారులకు సమాన అవకాశాలు
హొసపేటె: ఫిబ్రవరి 13 నుంచి 15 వరకు జరిగే హంపీ ఉత్సవం–2026లో సంగీత, సాంస్కృతిక, కళా నాటక రంగాలతో సహా వివిధ శైలుల కళాకారులకు సమాన అవకాశాలు కల్పిస్తామని జిల్లాధికారిణి కవిత ఎస్.మన్నికేరి తెలిపారు. సోమవారం నగరంలోని జిల్లాధికారి కార్యాలయంలో స్థానిక కళాకారులు, సంఘ సంస్థలతో హంపీ ఉత్సవానికి ముందు చేపట్టాల్సిన ఏర్పాట్లపై సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. గతంలో కంటే ఈసారి ఉత్సవాన్ని మరింత ప్రత్యేకంగా, వినూత్నంగా జరపాలని నిర్ణయించామన్నారు. ఆ ప్రకారం అన్ని సన్నాహాలు జరుగుతున్నాయి. అందువల్ల కళాకారులు, సంఘసంస్థలు, ప్రజలు సహకరించాలన్నారు. హంపీ ఉత్సవంలో అర్హులైన, స్థానిక కళాకారులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామన్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత మంజమ్మ జోగతి మాట్లాడుతూ నేడు హంపీ ఉత్సవాల్లో ప్రధాన వేదికపై సినిమా తారలు, ప్రసిద్ధ కళాకారులను మాత్రమే అనుమతిస్తున్నారు. తమలాంటి స్థానిక కళాకారులను విస్మరిస్తున్నారు. ఈ వివక్షత వీడి అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ భవనాలకు అలంకరణలు
హంపీ ఉత్సవంలో భాగంగా విరుపాక్ష ఆలయంతో సహా నగరంలోని అన్ని ప్రభుత్వ భవనాలు, ముఖ్యమైన కూడళ్లను విద్యుత్ దీపాలతో అలంకరించాలని సూచించారు. వైద్యం, పారిశుధ్యానికి అధిక ప్రాధ్యాన్యత ఇవ్వాలని సంఘం సభ్యుడు డిమాండ్ చేశారు. ఉత్సవంలో అంధులు, దివ్యాంగులకు వాహన పార్కింగ్ వ్యవస్థకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రజల సౌకర్యం కోసం వివిధ ప్రదేశాల్లో ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేయాలన్నారు. అదే విధంగా దివ్యాంగులు, అంధ కళాకారులను కూడా హంపీ ఉత్సవ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనడానికి అనుమతించాలన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ ఉత్సవాలు జరుగుతాయన్నారు. ఉత్సవాల నిర్వహణకు రూ.22 కోట్ల గ్రాంట్ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించామని జిల్లాధికారిణి చెప్పారు. శాసీ్త్రయ సంగీతం, తోలుబొమ్మలాట వంటి కనుమరుగవుతున్న కళారూపాల కోసం ప్రత్యేక వేదికను అందించాలన్నారు. జెడ్పీ సీఈఓ నోంగ్జోయ్ మహమ్మద్ అలీ అక్రమ్ షా, సబ్–డివిజనల్ ఆఫీసర్ వివేకానంద, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
విజయనగర జిల్లాధికారిణి కవిత ఎస్ మన్నికేరి
హంపీ ఉత్సవాలకు ఏర్పాట్లపై కళాకారులు, అధికారులతో సమీక్ష
కళాకారులకు సమాన అవకాశాలు


