గురు దక్షిణామూర్తయే నమః
కోలారు: నగరంలో అమాని చెరువు గట్టుపై వెలసిన శ్రీ గురు దక్షిణామూర్తి దేవాలయంలో స్వామి వారికి నూతన సంవత్సరం మొదటి శుక్రవారం సందర్భంగా విశేష పూజలను నిర్వహించారు. శెనక్కాయలు, జొన్న కంకులు, అనపకాయలతో స్వామివారిని అలంకరించారు. అర్చకులు సోమశేఖర దీక్షిత్ నేతృత్వంలో పూజలు జరిగాయి. పెద్దసంఖ్యలో భక్తులు దర్శనం చేసుకున్నారు.
అధికారులకు
కుల పక్షపాతం వద్దు: సీఎం
శివాజీనగర: ప్రభుత్వ అధికారులంతా కుల రహితంగా పనిచేయాలని, అలా జరిగినప్పుడే సమ సమాజ నిర్మాణం సాధ్యపడుతుందని సీఎం సిద్దరామయ్య తెలిపారు. శుక్రవారం విధానసౌధ సభా మందిరంలో కేఏఎస్ అధికారుల సంఘం క్యాలెండర్, డైరీని విడుదల చేసి మాట్లాడారు. రాష్ట్రంలో పేదలు, దళితులు, మైనారిటీల శ్రేయోభివృద్ధికి నూతన ఉత్సాహంతో శ్రమించాలని అధికారులకు సూచించారు. అసమానత తొలగకుండా, సమాజంలో శాంతి నెలకొనడం అసాధ్యమన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 7 దశాబ్దాలు గడిచినా కూడా ఇప్పటికీ కుల పద్ధతి పోలేదని అన్నారు. మీకు కుల పక్షపాతం ఉండకూడదన్నారు. తహశీల్దార్, అసిస్టెంట్ కమిషనర్తో పాటుగా వివిధ స్థాయిల్లోని అధికారులు విధులకు న్యాయం చేకూర్చేందుకు నిజాయితీగా ప్రయత్నించాలని సీఎం తెలిపారు. కేఏఎస్ అధికారుల భవన నిర్మాణానికి నిధులతో పాటు డిమాండ్ల పరిష్కారానికి హామీ ఇచ్చారు.
స్లీపర్ బస్సుకు ప్రమాదం, నలుగురికి గాయాలు
దొడ్డబళ్లాపురం: దేవనహళ్లి వద్ద గురువారం రాత్రి బెంగళూరు– హైదరాబాద్ 44వ హైవేలో టోల్ ప్లాజాను ప్రైవేటు స్లీపర్ కోచ్ బస్సు ఢీకొట్టింది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వస్తున్న ట్రాన్స్ ఇండియా స్లీపర్ కోచ్ బస్సు అతి వేగం కారణంగా అదుపుతప్పి టోల్ప్లాజా బూత్ను ఢీకొంది. బూత్తో పాటు బస్సు ముందు భాగం ధ్వంసమైంది. అయితే ఈ టోల్ప్లాజా పనిచేయడం లేదు, అందువల్ల అక్కడ సిబ్బంది ఎవరూ లేనందున ప్రాణనష్టం తప్పింది. అయితే బస్సు డ్రైవర్,క్లీనర్ లకు తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరు ప్రయాణికులు కూడా తీవ్రంగా గాయపడ్డారు.
ఫోన్లు, లగేజీలు చోరీ
ప్రమాదంతో ప్రయాణికులు తీవ్రంగా గాభరా పడ్డారు. ఇదే అదనుగా కొందరు వ్యక్తులు సాయం చేయడానికని వచ్చి ముగ్గురు ప్రయాణికుల వద్ద ఉన్న మూడు ఐఫోన్లను ఎత్తుకొని వెళ్లారు. లగేజీలు, ఇతర వస్తు సామగ్రిని దోచుకున్నారు. పోలీసులు,ఫైర్ సిబ్బంది చేరుకుని బాధితులను కాపాడి సమీప ఆస్పత్రులకు తరలించారు. దేవనహళ్లి ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
డిజిటల్ అరెస్ట్..
రూ.1.61 కోట్ల వసూలు
● కార్వార వద్ద రిటైర్డు
ఉపాధ్యాయునికి మోసం
యశవంతపుర: ముంబై పోలీసుల పేరిట వీడియో కాల్ చేసి సైబర్ వంచకులు కార్వార జిల్లా ముండగోడిలోని టిబెటన్ కాలనీకి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయున్ని డిజిటల్ అరెస్ట్ చేసి రూ.1.61 కోట్లను వసూలు చేశారు.
ఎలా జరిగింది
బాధితుడు పాల్డెన్ (72)కు వాట్సాప్ కాల్ చేసిన మోసగాడు.. తాను ముంబైలోని కొలాబా పోలీసుస్టేషన్ ఎస్ఐనని చెప్పుకున్నాడు. ముంబైలో అరెస్ట్ చేసిన ఉగ్రవాది వద్ద దొరికిన ఏటిఎం కార్డుల్లో మీ పేరు వచ్చినట్లు నమ్మించి బెదిరించాడు. మీ అకౌంట్ నుంచి కోట్ల రూపాయలు బదిలీ కావటంతో మీపై మనీ లాండరింగ్ కేసు నమోదైనట్లు చెప్పాడు. ఇదంతా నిజమేనని నమ్మిన పాల్డెన్ భయపడ్డాడు. మీ వద్దనున్న డబ్బునంతా ప్రభుత్వ ఖాతాలోకి బదిలీ చేయాలని మోసగాడు ఒత్తిడి చేశాడు. ఇది నమ్మిన పాల్డెన్ వివిధ బ్యాంక్ ఖాతాలలో ఉన్న ఎఫ్డి డబ్బులు, బంధువుల వద్ద నుంచి అప్పులు తెచ్చి సుమారు రూ.1.61 కోట్లను పలు విడతలుగా వంచకుల ఖాతాలకు పంపించాడు. చివరకు మోసం జరిగిందని తెలుసుకున్న పాల్డెన్ కార్వార సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గురు దక్షిణామూర్తయే నమః


