ఓట్ చోరీ, సిట్, ముడా, మలెనాడు..
శివాజీనగర: గ్రేటర్ బెంగళూరు ప్రాధికార పరిపాలనా రెండో సవరణ బిల్లును మంగళవారం బెళగావి అసెంబ్లీ విధానసభలో ప్రవేశపెట్టారు. డీసీఎం, బెంగళూరు నగరాభివృద్ధి మంత్రి డీ.కే.శివకుమార్ విధానసభలో జీబీఏ పరిపాలనా బిల్లు (2వ సవరణ)ను ప్రవేశపెట్టి మాట్లాడారు. చిక్కబళ్లాపురం ఎంపీ స్థానంలోని కొన్ని భాగాలు పాలికె పరిధిలోకి వస్తాయని తెలిపారు. పాలికె పరిధిలో నివాసమున్న ప్రజా ప్రతినిధుల పేర్లను తొలగించి, స్థానిక సంస్థల ప్రతినిధులు, పరిషత్ సభ్యులను జీబీఏ సభ్యులుగా చేర్చేలా సవరణ తోడ్పడుతుందని చెప్పారు. అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నగరాభివృద్ధి కార్యదర్శులను జీబీఏలో పాలనలోకి చేర్చారు.
నామినేటెడ్ సభ్యులపై అభ్యంతరం
బీజేపీ ఎమ్మెల్యే సురేశ్కుమార్ మాట్లాడుతూ, ఇప్పటికే 369 పాలికె కార్పొరేటర్లు ఉంటారు. ప్రభుత్వం 20 వేల మంది ప్రజలకు ఒక నామినేటెడ్ సభ్యున్ని చొప్పున నియమిస్తే , మళ్లీ 369 మంది సభ్యులు వస్తారు. ఇది మంచిదేనా అని ప్రజలు ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు. డీకే శివకుమార్ స్పందిస్తూ గ్రేటర్ బెంగళూరు ప్రాధికారకు ఎలాంటి ఎన్నికలు జరగవు. ఇది రాష్ట్రస్థాయి సంస్థ. ఎలాంటి సమస్య రాదు. ముందు కొత్త ప్రాంతాన్ని పాలికె పరిధిలోకి చేర్చుకొన్నపుడు ఆ భాగంలో 6 నెలల్లోగా ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. ఈ ప్రాంతంలో ఎవరైనా పంచాయితీ సభ్యులుగా ఉంటే, వారికి ఇందులో ఓటు హక్కు రాదు. మీ సలహా ప్రకారం నామినేటెడ్ సభ్యుల చేరికను రద్దు చేశామని వివరించారు.
ఒక్కరికి ఒక్కచోటే ఓటు
బీజేపీ నాయకుడు ఆర్.అశోక్ మాట్లాడుతూ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఒక్కో నగరసభ, పురసభలకు మార్చి మార్చి వెళ్తుంటారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేస్తారు. ఇది నకిలీ ఓటింగ్ అవుతోంది. అందుచేత వారు ఏదైనా ఒక్కచోటే ఐదేళ్లు వారి ఓటును ఉపయోగించుకోవాలి అని కోరారు. ఈ సలహాను ఆమోదిస్తాను, ఎవరైనా ఒకచోటే ఓటు వేయాలని డీసీఎం శివ తెలిపారు. ఇందుకు బసవరాజ రాయరెడ్డి అభ్యంతరం చెప్పగా, సమాధానమిచ్చిన శివకుమార్, అలాగని ఓటింగ్ను టూరింగ్ టాకీస్ చేసుకోవడం సాధ్యపడదని స్పష్టం చేశారు.
బెళగావి అసెంబ్లీలో
డీసీఎం శివకుమార్ బిల్లు
కొత్త ప్రాంతాల చేరికలు
నామినేటెడ్ సభ్యులపై పరిమితి
ఓటింగ్ విధానంలోనూ మార్పులు
చర్చకు ఇరుపక్షాల పట్టు
శివాజీనగర: ఓటు చోరీ కేసు గురించి చర్చించాలని విధానసభలో అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు డిమాండ్ చేశారు. ఇందుకు ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. కల్బుర్గి జిల్లా ఆళంద కాంగ్రెస్ ఎమ్మెల్యే బీ.ఆర్.పాటిల్ విషయాన్ని ప్రస్తావించారు. ఓటు చోరీలో ఎవరి ప్రమేయం ఉందనేది సిట్ ద్వారా బహిరంగమైందన్నారు. దీనిపై చర్చకు అవకాశం కల్పించాలని పట్టుబట్టారు. బీజేపీ పక్ష నాయకుడు ఆర్.అశోక్ మాట్లాడుతూ గృహలక్ష్మీ పథకం సొమ్ముల చెల్లింపుపై మంత్రి తప్పు సమాధానం ఇచ్చారు, సరైన జవాబు ఇవ్వాలని కోరారు. స్పీకర్ ఖాదర్ సరేనని ఆమోదించారు. కానీ ఓట్ చోరీపై చర్చ సాగాలని ఎమ్మెల్యే కే.ఎం.శివలింగేగౌడతో పాటుగా పలువురు పట్టుబట్టారు. మంత్రి ప్రియాంక ఖర్గే కూడా తోడయ్యారు. బీజేపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఆళందపై విచారించిన సిట్ నివేదికను సభలో ప్రవేశపెట్టాలని కోరారు. అలాగే ధర్మస్థలతో పాటుగా వివిధ అంశాలపై సిట్ల నివేదికలను ఇక్కడ పెట్టి చర్చ చేయాలని కోరారు. ఈ సమయంలో ఖర్గే, బీజేపీ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం మొదలైంది. మైసూరు ముడాలోని స్థలాల పంపిణీ గురించి చర్చ సాగాలి అని బీజేపీ సభ్యులు ఎదురుదాడికి దిగారు. స్పీకర్ స్పందిస్తూ మీరు కోరినట్లు బుధవారం లేదా, గురువారం అవకాశం కల్పిస్తామని భరోసానిచ్చారు.
ఎప్పడూ ఉత్తర కర్ణాటకేనా?
ఎప్పుడూ ఉత్తర కర్ణాటకే కాదు, మలెనాడు సమస్యలపై చర్చ అవకాశమివ్వాలని బీజేపీ ఎమ్మెల్యే సునీల్కుమార్ పట్టుబట్టారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే బేళూరు గోపాలకృష్ణ ఇందుకు మద్దతు పలికారు. ఉత్తర కర్ణాటక చర్చపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి అని అశోక్ కోరారు. స్పీకర్ మాట్లాడుతూ ఎప్పుడూ సీనియర్లే కాదు, కొత్త ఎమ్మెల్యేలు మాట్లాడడానికి సమయం ఇవ్వాలి. మంగళవారం ఎంత అర్ధరాత్రి అయినా సరే, చర్చను ముగిస్తాం. బుధవారం ఉత్తర కర్ణాటక గురించి చర్చ ఉండదు అని సభను కొనసాగించారు.
ఓట్ చోరీ, సిట్, ముడా, మలెనాడు..
ఓట్ చోరీ, సిట్, ముడా, మలెనాడు..
ఓట్ చోరీ, సిట్, ముడా, మలెనాడు..


