ఏమైనా జరగనీ.. – సీఎం వేదాంత ధోరణి
శివాజీనగర: ముఖ్యమంత్రి మార్పు గురించిన పద్మవ్యూహంలో మరో రోజు గడిచింది. హైకమాండ్ ఆదేశాల మేరకు తామిద్దరం నడుచుకొంటామని సీఎం సిద్దరామయ్య ప్రకటించారు. తన చేతిలో ఏమీ లేదని, అంతా అధిష్టానం దయ అని డీసీఎం డీకే శివకుమార్కు ఈ రీతిలో స్పష్టం చేశారు. గత నెల 29వ తేదీన సీఎం సిద్దరామయ్య తన నివాసంలో శివకుమార్కు అల్పాహార విందు ఇవ్వడం తెలిసిందే. మళ్లీ హైకమాండ్ ఆదేశాలతో మంగళవారం శివకుమార్ తన ఇంట్లో సీఎంతో బ్రేక్ఫాస్ట్ విందు భేటీ జరిపారు. ఇద్దరూ సాదరంగా ఉంటూ ఐక్యతను ప్రదర్శించారు.
అవిశ్వాసం పెడతారట
సదాశివనగరలో ఉన్న శివకుమార్ ఇంటిలో అల్పాహారం సేవనం తరువాత సిద్దరామయ్య విలేకరులతో మాట్లాడారు, తాము ఎప్పటికీ కలసికట్టుగా ఉన్నామన్నారు. 8 నుంచి బెళగావిలో జరగబోయే అసెంబ్లీ శీతాకాల సమావేశాలు 2 వారాల పాటు ఉంటాయి, అందులో వ్యవహరించడం గురించి చర్చించామని తెలిపారు. బీజేపీ,జేడీఎస్లు ప్రభుత్వం మీద అవిశ్వాసం ప్రవేశపెట్టవచ్చని తెలిసిందన్నారు. వారిని ఎదుర్కొవటానికి సంసిద్ధంగా ఉన్నామన్నారు. మా ఇద్దరిదీ ఒకే మాట, ఒకే బాట అని శివకుమార్ కూడా చెప్పారు. ప్రతిపక్షాలు ఏమి చేసినా సమర్థంగా ఎదుర్కొంటామన్నారు. రాష్ట్రం సమస్యలు, రైతుల ఇబ్బందులపై చర్చించేందుకు డిసెంబర్ 8న ఢిల్లీకి వెళ్లి వస్తామని తెలిపారు.
తదుపరి ఏమిటి?
అల్పాహార భేటీలో ఉభయులు ఒక గంటకు పైగా మాట్లాడుకున్నారు. నాటు కోడి చారు, ఇడ్లీ రుచి చూశారు. డీకే సోదరుడు డీ.కే.సురేశ్, ఎమ్మెల్యే కుణిగల్ రంగనాథ్ ఉన్నారు. ఇద్దరికీ రెండు విందులు ముగిశాయి, ఇక హైకమాండ్ ఇచ్చే తదుపరి టాస్క్ ఏమిటనేది ఉత్కంఠగా మారింది.
అసలైన సినిమా ముందుంది: బొమ్మై
యశవంతపుర: సీఎం, డీసీఎం అల్పాహార విందులు టీజర్ మాత్రమే. అసలైన సినిమా మునుముందు విడుదల అవుతుంది.. అని బీజేపీ నేత, మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై హాస్యమాడారు. ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ కొన్నిరోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం అవుతుందన్నారు. సీఎం సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్ బ్రేక్ఫాస్ట్లతో కాలం గడుపుతున్నారు. ప్రజల సమస్యలను పట్టించుకొనేవారు కరువయ్యారు. ఒకరు సీఎం సీటును దక్కించుకోవడానికి, మరొకరు దానిని కాపాడుకోవడానికి య త్నిస్తున్నారు అని ఎద్దేవా చేశారు. ఈ నాటకాలను బంద్ చేయాలని ప్రజలు కోరుతున్నారు, కాంగ్రెస్ పార్టీకి హైకమాండ్ ఎవరు, ఎక్కడ ఉంది?, రాష్ట్ర కాంగ్రెస్కు బాస్ ఎవరు? అని అన్నారు.
నేనూ బ్రేక్ఫాస్ట్ విందు ఇస్తా: హోంమంత్రి
సీఎం సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్లు అల్పాహార విందుకు నన్ను పిలిచి ఉంటే వెళ్లేవాడినని హోంమంత్రి జీ.పరమేశ్వర్ అన్నారు. అవసరమైతే తాను వారిద్దరికీ బ్రేక్ఫాస్ట్ను ఇవ్వాలని నిర్ణయించిన్నట్లు చెప్పారు. మంగళవారం బెంగళూరులో విలేకరులతో మాట్లాడుతూ అల్పాహారం ఆరగిస్తూ ఇద్దరితో మాట్లాడుతూ సలహాలను తీసుకుంటానని చమత్కరించారు. సిద్ధరామయ్య, శివకుమార్లు ఉల్లాసంగా ఉన్నారు. సీఎం పదవి గురించి ఎలాంటి చర్చలు జరగలేదన్నారు. అనవసరమైన వదంతులను నమ్మవద్దన్నారు. కాగా, ప్రభుత్వం రాజకీయాలలో పడి రైతులను గాలికి వదిలేసిందని ధార్వాడలో బీజేపీ ర్యాలీ జరిపింది.
ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదంటూ ధార్వాడలో బీజేపీ ర్యాలీ
మంగళవారం అల్పాహార విందు తరువాత సీఎం సిద్దు, డీసీఎం శివ
శక్తికేంద్రం విధానసౌధ
మీద అందరి కన్ను
డిప్యూటీ సీఎం ఇంట సీఎం సిద్దుకు అల్పాహార విందు
నాటుకోడి చారు, ఇడ్లీ ఆరగింపు
ఆత్మీయంగా ఇద్దరు నేతలు
ఇది కాంగ్రెస్ బిగ్బాస్ ఆట: అశోక్
శివాజీనగర: కాంగ్రెస్ నాయకుల కుర్చీ పంచాయితీ బిగ్ బాస్ షో మాదిరిగా ఉందని బీజేపీ పక్ష నేత ఆర్.అశోక్ అన్నారు. బెంగళూరులో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ నాయకులు బిగ్ బాస్లో మాదిరిగా గొడవ గొడవ చేస్తున్నారు. కుర్చీ కోసం పోటీ పడుతున్నారు. ఇచ్చిన మాట మీద నిలబడకపోతే ఆ భగవంతుడు మెచ్చుకోడని డీసీఎం డైలాగ్ కొడుతున్నారు. సీఎం సిద్దరామయ్య, తాను ఎవరికీ మాట ఇవ్వలేదని అంటున్నారు అని ఎద్దేవా చేశారు. మధ్యలో ట్వీట్ల యుద్ధం కూడా జరుగుతోందన్నారు. ఇది కాంగ్రెస్లో బిగ్బాస్ రియల్ షో, సోనియాగాంధీ, రాహుల్గాంధీ, వేణుగోపాల్ దీని ప్రాయోజకులు. మంత్రులు సతీశ్ జార్కిహొళి, పరమేశ్వర్ వైల్డ్ కార్డు ఎంట్రీకి వేచి ఉన్నారు అని విమర్శించారు.
సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ల నడుమ రెండో అల్పాహార విందు భేటీ విజయవంతంగా జరిగింది. డీకే తనదైన ఆతిథ్యాన్ని సిద్దరామయ్యకు రుచి చూపించారు. ఇకనైనా సిద్దరామయ్య మెత్తబడి మాట నిలబెట్టుకుంటారని శివకుమార్ ఆశాభావంతో ఉండవచ్చు.
శివాజీనగర: డీసీఎం ఇంట్లో ఆరగింపు చేసిన తరువాత సీఎం సిద్దరామయ్య వేదాంత ధోరణిలో మాట్లాడినట్లు తెలిసింది. విధానసౌధ కెంగల్ గేట్ వద్ద ఎమ్మెల్యే బేళూరు గోపాలకృష్ణ, సీఎంను కలిసి ముచ్చటించారు. రాజకీయాలు ఎవరికీ శాశ్వతం కాదు, దేనినీ అంతగా పట్టించుకోను. ఇదేమీ మా తండ్రి ఆస్తి కాదు. దీని గురించి ఎక్కువగా ఆలోచించను. ఏమి జరుగుతుందో జరగనీ అని సిద్దరామయ్య చెప్పినట్లు తెలిసింది. దీనిని బట్టి కాంగ్రెస్ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా పాటించాలని సిద్దు తీర్మానానికి వచ్చినట్లు సమాచారం.
ఏమైనా జరగనీ.. – సీఎం వేదాంత ధోరణి
ఏమైనా జరగనీ.. – సీఎం వేదాంత ధోరణి
ఏమైనా జరగనీ.. – సీఎం వేదాంత ధోరణి


