
46 పీఓపీ గణేష్ విగ్రహాల జప్తు
హుబ్లీ: జిల్లాలోని అణ్ణిగేరి హాలదూటర వీధిలో అక్రమంగా తయారు చేస్తున్న ముత్తణ్ణ కుర్తకోటికి చెందిన 46 పీఓపీ(ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్) గణపతులను సంబంధిత అధికారులు స్వాధీన పరుచుకున్నారు. ఆ తాలూకా తహసీల్దార్ మంజునాథ దాసప్పనవర నేతృత్వంలో బుధవారం రాత్రి తనిఖీ చేసి విగ్రహాలను జప్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా పర్యావరణ అధికారి జగదీశ్ గద్దిగౌడర్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
రెండు బైక్ల ఢీ.. ఒకరి మృతి
హుబ్లీ: ధార్వాడ జిల్లా హుబ్లీ తాలూకా అంచటగేరి గ్రామ సమీపంలోని పంజాబీ ధాబా వద్ద రెండు బైక్లు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన ఓ బైక్ చోదకుడు మృతి చెందాడు. చెన్నపుర గ్రామానికి చెందిన కిరణ్ (24) మృతుడు. మరో బైక్ చోదకుడు అఖిల్ షిండేకర్ కలఘటిగి నుంచి హుబ్లీ వైపునకు వస్తుండగా అదుపు తప్పి ఎదురుగా వస్తున్న కిరణ్ బైక్ను ఢీకొన్నాడు. తీవ్రంగా గాయపడిన ఆయన్ను కేఎంసీ ఆస్పత్రిలో చేర్పించినా ఫలితం దక్కలేదు. ఘటనపై హుబ్లీ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకొని కేసు దర్యాప్తు చేపట్టారు.
మైక్రోఫైనాన్స్ వేధింపులతో యువకుడు ఆత్మహత్య
సాక్షి బళ్లారి: ఓ ఫైనాన్స్ కంపెనీలో అప్పు తీసుకున్న యువకుడు సకాలంలో తిరిగి చెల్లించకపోవడంతో ఫైనాన్స్ సిబ్బంది వేధింపులకు గురి చేయడంతో సదరు అప్పు తీసుకొన్న యువకుడు ఆత్మహత్య చేసుకొన్నాడు. వివరాలు.. దావణగెరె జిల్లాకు చెందిన యశ్వంత్ నాయక్(24) అనే యువకుడు శివమొగ్గ ఫైనాన్స్ కంపెనీలో రూ.5 లక్షలను అప్పు తీసుకొన్నాడు. అయితే సరిగా కంతులు చెల్లించలేక పోవడంతో తీసుకున్న అప్పు కట్టకపోతే ఇంటిని జప్తు చేస్తామని మైక్రో ఫైనాన్స్ సిబ్బంది బెదిరించారు. మరో వైపు బైక్ను తాకట్టు పెట్టి రూ.40 వేలు అప్పు తీసుకొన్న నేపథ్యంలో అది కూడా తిరిగి ఇవ్వకపోవడంతో వారు కూడా వేధించడంతో యశ్వంత్ నాయక్ తాను అప్పుల వారి వేధింపులతో ఆత్మహత్య చేసుకుంటున్నానని, తనను క్షమించాలని తండ్రికి రాసిన డెత్ నోటులో కన్నీటి గాథ వివరించాడు.
ఆర్టీఐ దరఖాస్తు చేసిన
న్యాయవాదిపై దాడి
హుబ్లీ: ఆర్టీఐ(సమాచార హక్కు) చట్టం ద్వారా వీధి పశువుల టెండర్ ప్రక్రియ గురించి వివరాలు అడిగాడన్న కోపంతో ఇద్దరు వ్యక్తులు న్యాయవాది చంద్రకాంత్పై దాడి చేసి హత్యాయత్నానికి ప్రయత్నించారు. కోర్టులో పెండింగ్లో ఉన్న అపరాధ కేసులను వాదించినందుకు, వీధి పశువుల టెండర్ ప్రక్రియ గురించి ఆర్టీఐ ద్వారా వివరాలు అడిగిన కాశప్ప బిజవాడ, మంజుల బిజవాడ దాడి చేశారని బాధిత న్యాయవాది చంద్రకాంత్ బెండిగేరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
రూ.250 చెల్లించనందుకు దాడి
హుబ్లీ: కేవలం రూ.250 కోసం ఓ వ్యక్తి తన స్నేహితుడిని బాటిల్తో పొడిచి దాడి చేసిన దారుణ ఘటన ధార్వాడ తాలూకా హెబ్బళ్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఆ గ్రామానికి చెందిన రాయాసాబ్ నదాఫ్ తన స్నేహితుడు ప్రవీణ్ వద్ద రూ.250 అప్పు తీసుకున్నాడు. ఆ డబ్బులను వాపస్ ఇవ్వాలని రాయాసాబ్ను ప్రవీణ్ అడిగాడు. దీనికి ప్రస్తుతం తన వద్ద డబ్బులు లేవని రాయాసాబ్ బదులిచ్చాడు. దీంతో కోపగించుకున్న ప్రవీణ్ ఇచ్చిన డబ్బులను తిరిగి ఇవ్వమంటే డబ్బులు లేవని సాకు చెబుతావా? అంటూ గాజు బాటిల్ పగలగొట్టి దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన రాయాసాబ్ను హుబ్లీ కేఎంసీ ఆస్పత్రిలో చేర్పించినట్లు, నిందితుడు ప్రవీణ్ను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేపట్టినట్లు ధార్వాడ గ్రామీణ పోలీసులు తెలిపారు.
రైలు పట్టాలపై వృద్ధుడి ఆత్మహత్యాయత్నం ●
● అర నిమిషంలో రక్షించిన వైనం
హుబ్లీ: రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చిన వృద్ధుడిని ఓ వ్యక్తి రక్షించిన ఘటన దావణగెరెలోని దేవరాజ అరసు లే అవుట్ వద్ద చోటు చేసుకుంది. దావణగెరెలోని వినాయక నగర్కు చెందిన వృద్ధుడు కుటుంబ సభ్యులతో విసిగి జీవితంపై విరక్తి చెంది రైలు పట్టాలపై పడుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. దీన్ని గమనించిన స్థానికుడు విరుపాక్ష బెళగుత్తి ఆయన్ను రక్షించారు. కాగా వృద్ధుడిని రక్షించిన 30 సెకన్లలో ఆ మార్గంలో రైలు దూసుకెళ్లడం గమనార్హం.
రోడ్లలో గుంతలు పూడ్చరూ
రాయచూరు రూరల్: నగరంలో వివిధ రోడ్లలో పడ్డ గుంతలను పూడ్చాలని ఎస్యూసీఐ డిమాండ్ చేసింది. గురువారం పాత జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో జిల్లాధ్యక్షుడు చంద్ర గిరీష్ మాట్లాడారు. నగరసభకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.కోట్లాది మేర నిధులు వచ్చినా రోడ్లలో పడిన గుంతలను పూడ్చడంలో అధికారులు, కౌన్సిలర్లు నిర్లక్ష్యం వహించడం తగదన్నారు. నగరంలో వివిధ వార్డుల్లో పడిన పెద్ద గుంతల మరమ్మతులకు ముందుకు రావాలన్నారు. నగరంలో రక్షిత మంచి నీటి ఽశుద్ధీకరణ చేయాలన్నారు. వీధి కుక్కల బెడద నివారించాలని, మురుగు కాలువల్లో పేరుకున్న పూడికను తీయాలని కోరుతూ మహానగర పాలికె కమిషనర్ జుబిన్ మహాపాత్రోకు వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో చెన్నబసవ, వీరేష్, మహేష్, సోమశేఖర్లున్నారు.

46 పీఓపీ గణేష్ విగ్రహాల జప్తు