బళ్లారి రూరల్ : ప్రస్తుతం అత్యవసర పరిస్థితుల్లో జిల్లా ప్రజల రక్షణ కోసం జిల్లాధికారి సారధ్యంలో శనివారం జిల్లా విపత్తు నిర్వహణ ప్రాధికార సమావేశం జరిగింది. జిల్లాధికారి మాట్లాడుతూ జిల్లా సరిహద్దు ప్రాంతాలు, జనసమూహంతో రద్దీగా ఉండే ప్రాంతాల్లో కట్టుదిట్టమైన రక్షణ ఏర్పాట్లు చేసి ప్రజలను జాగృతపరచాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల దృష్ట్యా జగళూరులో శనివారం ఉదయం మాక్డ్రిల్ నిర్వహించినట్లు తెలిపారు. 12న దావణగెరె నగరంలో నిత్యం రద్దీగా ఉండే కేఎస్ఆర్టీసీ బస్టాండు, రైల్వేస్టేషన్లో మాక్డ్రిల్ నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే విధంగా తాలూకాల్లోను, గ్రామ పంచాయితీ ప్రజలను అప్రమత్తం చేయడానికి మాక్డ్రిల్ను నిర్వహిస్తారన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు తమ రక్షణకోసం తీసు కోవాల్సిన జాగ్రత్తలను ప్రదర్శనల రూపంలో తెలియజేస్తారన్నారు. అత్యవసర సమావేశంలో అధికారులు, జిల్లా విపత్తు నిర్వహణ ప్రాధికార అధికారులు పాల్గొన్నారు.
లక్ష్మీ నరసింహ స్వామి జయంతి
రాయచూరు రూరల్: మంత్రాలయం మఠంలో లక్ష్మీద నరసింహ స్వామి జయంతి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నెరవేర్చారు. శనివారం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగళ్ అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రాంగణంలో స్వామివారిని భక్తులు దైవదర్శనం చేసుకున్నారు.
నేడు శివాచార్య స్వామి ఆరాధనోత్సవాలు
బళ్లారి రూరల్ : అల్లీపురలోని రేణుకాచార్య ఆశ్రమంలో ఆదివారం రేణుకాచార్య ట్రస్ట్ ఆధ్వర్యంలో ముక్తిముని శివాచార్య సామీజీ 4వ వర్థంతి సందర్భంగా ఆరాధనోత్సవాలు జరుపనున్నట్లు ట్రస్ట్ అధ్యక్షుడు హంపయ్యస్వామి రావిహాళ తెలిపారు. కార్యక్రమంలో భాగంగా హరగినడోణి పంచవణ్గె హిరేమఠాధిపతి అభినవ సిద్దలింగ శివాచార్య మహామునిచే ధ్వజస్తంభ లోకార్పణ, పల్లకీ ఊరేగింపు, 108 కుంభాభిషేకం, శివాచార్యులకు గంగాస్నానం, 500 మంది ముత్తైదువులకు ఒడిబియ్యం, భక్తులకు అన్న సంతర్పణ నిర్వహించనున్నట్లు తెలిపారు. ముఖ్య అతిథులుగా ప్రముఖులు ఈశ్వరయ్యస్వామి, సిద్దలింగశాస్త్రి, డాక్టర్ ఏఎం సిద్దేశ్వరి, కే.వీ.రామలింగప్ప, ఎస్.గురులింగనగౌడ, బెస్ట్ శ్రీనివాస్ పాల్గొంటారని తెలిపారు.
కార్మికుల సమస్యలు పట్టవా?
రాయచూరు రూరల్: వివిధ రంగాల్లో పని చేస్తున్న కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సర్కార్లు స్పందించాలని ఏఐసీసీటీయూ రాష్ట్ర అధ్యక్షుడు అప్పణ్ణ డిమాండ్ చేశారు. శనివారం కన్నడ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల కార్మికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో విధులు నిర్వహించే వారికి సమాన వేతనాలు, పీఎఫ్, జీపీఎఫ్, గ్రాచ్యుటీ సౌకర్యాలు కల్పించాలని కోరారు. కనీస వేతనాలు చెల్లించాలని, 8 గంటల పని, కాంట్రాక్ట్ పద్ధతిని రద్దు చేసి పర్మినెంట్ చేయాలన్నారు. సమావేశంలో శరణ బసవ, వీరేష్, రవి, మల్లప్ప, తిమ్మారెడ్డి, బాషుమియా, నాగరాజ్, మహేష్, కాశప్ప కంబళిలున్నారు.
వీర సైనికులకు మద్దతుగా ర్యాలీ
రాయచూరు రూరల్: కశ్మీర్ ప్రాంతంలో బైసారన్, పహల్గాంల మధ్య తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో మరణించిన వారికి హిందూ, ముస్లిం యువకులు సంతాపం వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో ఫైసల్ ఖాన్ మాట్లాడారు. కశ్మీర్లోని పహల్గాంలో ప్రాణాలు కోల్పోయిన వారికి న్యాయం లభించేలా చూడాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ప్రత్యేక విచారణ చేపట్టి తప్పు చేిసిన వారికి ఉరిశిక్ష వేయాలన్నారు. తీన్ కందిల్ నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు కొవ్వొత్తులు పట్టుకొని ర్యాలీ చేశారు. భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధానికి బయలుదేరిన వీర సైనికులకు మద్దతు పలికారు.
ఆడుకుంటూ బావిలో పడి చిన్నారి మృతి
హుబ్లీ: ఇంటి ముందు ఆటలాడుకుంటున్న చిన్నారి అదుపు తప్పి బావిలో పడి మృతి చెందిన ఘటన విజయపుర జిల్లా ముద్దేబిహాళ్లో చోటు చేసుకుంది. 3 ఏళ్ల హర్షిత్ మృతి చెందిన బాలుడు. శుక్రవారం బాలుడు కనిపించకుండా పోయాడు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన చెంది అంతటా గాలించినా బిడ్డ ఆచూకీ దొరకలేదు. దీంతో అనుమానంతో శనివారం బావిలో పరిశీలించగా బాలుడి మృతదేహం లభించింది. ఇది తెరిచిన బావి అని, బావి చుట్టు పక్కల చిన్నారి ఆడుకుంటూ అదుపు తప్పి బావిలో పడి చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. ఘటనపై ముద్దేబిహాళ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
అందరూ అప్రమత్తంగా ఉండాలి
అందరూ అప్రమత్తంగా ఉండాలి