
ఏటీఎం బందిపోట్లపై కాల్పులు
యశవంతపుర: కలబుర్గి నగరంలో కాకడె సర్కిల్లోని ఎటీఎంను దోచుకొని పరారైన నిందితులపై పోలీసులు కాల్పులు జరిపి బంధించారు. నిందితులు తస్లీం (28), షరీఫ్ (22) గాయపడ్డారు. వీరి స్వస్థలం హరియానా కాగా దేశమంతటా తిరుగుతూ నగదు దొంగతనాలకు పాల్పడేవారు. శనివారం ఉదయం బేలూరు క్రాస్ సమీపంలో నిందితులు కారుతో ఉన్నట్లు తెలిసి సబ్ అర్బన్ స్టేషన్ సీఐ సంతోష్ తట్టెపల్లి, ఎస్ఐ బసవరాజు వెళ్లి నిందితులు లొంగిపోవాలని హెచ్చరించారు. అయితే నిందితులు చాకుతో దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించారు. పోలీసులు ఆత్మరక్షణ కోసం నిందితులపై కాల్పులు జరిపి పట్టుకున్నారు. వారితో కలిసి కారులో ఉన్న మరో ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
ఈ నెల 9న రూ.20 లక్షల లూటీ
ఏటీఎంలను దోచుకెళ్లడంలో ఈ ముఠా ఆరితేరినది. ఈ నెల 9న గ్యాస్ కట్టర్ను ఉపయోగించి కాకడె సర్కల్కు సమీపంలోని ఎస్బీఎం ఏటీఎంను బద్దలు గొట్టి రూ. 20 లక్షల డబ్బును దోచుకెళ్లారు. అప్పటినుంచి పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. ఇంతలో మరో ఏటీఎంను లూటీ చేయాలని నగరానికి వచ్చారని పోలీసు కమిషనర్ శరణప్ప తెలిపారు. కాల్పుల్లో గాయాలైన నిందితులు షరీఫ్, తస్లీంలను జిమ్స్ ట్రామా కేర్ సెంటర్లో చేర్చి చికిత్సలు అందిస్తున్నారు. దాడిలో మంజు, ఫిరోజ్, రాజ్కుమార్ అనే పోలీసులకు కూడా రక్తగాయాలు కాగా ఆస్పత్రిలో చేరారు. తస్లీంపై గతంలో వివిధ పోలీసుస్టేషన్లలో 8 కేసులు, షరీఫ్పై 3 కేసులున్నట్లు పోలీసులు తెలిపారు.
కలబుర్గిలో కలకలం
ఇద్దరు దొంగలకు,
ముగ్గురు పోలీసులకు గాయాలు

ఏటీఎం బందిపోట్లపై కాల్పులు