తీర్థయాత్రలో పెను ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

తీర్థయాత్రలో పెను ప్రమాదం

Apr 14 2025 1:54 AM | Updated on Apr 17 2025 1:20 PM

-

పుంగనూరు: ఉపాధ్యాయ దంపతులు నూతన కారు కొనుగోలు చేశారు. అదే సమయంలో కుమార్తె ఇంటర్‌లో అధిక మార్కులు సాధించడంతో సంతోషంగా తీర్థ యాత్రకు వెళ్లి ఇంటికి తిరిగి వెళుతున్న సమయంలో తీర్థయాత్ర అంతిమ యాత్రగా మారింది. ఓ లారీ మృత్యువు రూపంలో వచ్చి ఆ సంతోషాన్ని క్షణాల్లో చిదిమేయడంతో తల్లి మృతి చెందగా భర్త, కుమార్తె తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ విషాదకర సంఘటన ఆదివారం జరిగింది.

తిరువణ్నామలైకి వెళ్లి వస్తుండగా..

వివరాలిలా ఉన్నాయి. శ్రీసత్యసాయి(పుట్టపర్తి) జిల్లా కదిరి పట్టణంలో నివాసం ఉన్న వెంకటరమణ (48) , శారద (45) ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. వీరికి కుమార్తె కీర్తన (17), కుమారుడు శ్రీకర్‌ (12) ఉన్నారు. వెంకటరమణ నూతనంగా కారు కొనుగోలు చేశారు. కుమార్తె ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో 976 మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. కుమారుడు శ్రీకర్‌ విజయవాడలో 7వ తరగతి చదువుతున్నాడు. శనివారం తమిళనాడులోని తిరువణ్నామలైలో గిరి ప్రదక్షిణానికి వెళ్లారు. స్వామి వారిని దర్శించుకుని ఆదివారం ఉదయం అక్కడి నుంచి కదిరికి బయలు దేరారు.

ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు..

పుంగనూరు మండలం సుగాలిమిట్ట వద్దకు కారు రాగానే ఎదురుగా మదనపల్లె నుంచి వస్తున్న ఐషర్‌ లారీ, కారు ఢీకొన్నాయి. కారు నుజ్జునుజ్జు కాగా ఈ ప్రమాదంలో శారద అక్కడికక్కడే చనిపోయింది. వెంకటరమణ, కుమార్తె కీర్తన తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గమనించి బాధితులను మదనపల్లె ఆసుపత్రికి తరలించారు. వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు చేపట్టారు. శారద కదిరి మండలం బాలప్పగారిపల్లెలో టీచర్‌గా పని చేస్తున్నారు. వెంకటరమణ అన్నమయ్య జిల్లా సోంపల్లెలో స్కూల్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. కాగా వెంకటరమణ స్వగ్రామం కలకడ మండలం ఎర్రయ్యగారిపల్లె కావడంతో అంత్యక్రియలు అక్కడ నిర్వహించనున్నారు. ఈ ఘటనతో బంధుమిత్రుల రోదనలు చూపరులను కలచివేశాయి.

కొత్త కారు, ఐషర్‌ లారీ ఢీ

మహిళా టీచర్‌ దుర్మరణం

భర్త, కూతురికి తీవ్రగాయాలు

పుంగనూరు వద్ద విషాదం

బాధితులు కదిరివాసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement