డిగ్రీ కళాశాలల్లో సంస్కృత పాఠాలు షురూ
రాయచూరు రూరల్: రాయచూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో కేంద్ర సంస్కృత విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో సంస్కృత భాషలో పాఠ్యాంశాలు ప్రారంభం చేయనున్నట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ యంకణ్ణ వెల్లడించారు. బుధవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంఏలో చరిత్ర, రాజనీతి, ఆర్థిక, సామాన్య, సాంఘీక శాస్త్రంతో కూడిన అధ్యయనంతో పాటు ఇతర విషయాల మాదిరిగా మొట్టమొదటిసారిగా సంస్కృత పాఠ్యాంశాలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఆళంద నగరసభ అధ్యక్షుడి సభ్యత్వం రద్దు
రాయచూరు రూరల్: ఆళంద నగరసభ అధ్యక్షుడి సభ్యత్వాన్ని జిల్లాధికారి రద్దు చేసిన ఘటన కలబుర్గి జిల్లాలో చోటు చేసుకుంది. బుధవారం కలబుర్గి జిల్లాధికారిణి ఫౌజియ తరన్నమ్ అధ్యక్షుడు ఫిర్దోస్ ఆరిఫ్ అన్సారీ సభ్యత్వాన్ని రద్దు చేశారు. ఆళంద వార్డు నంబర్–13 నుంచి అధ్యక్షుడు నగరసభ సభ్యుడిగా గెలుపొందారు. అయితే సామాన్య సమావేశాలకు నిరంతరం గైర్హాజరు అవుతుండడంతో పాటు అధ్యక్షుడిపై సరిహద్దు బహిష్కరణ కేసుతో పాటు పలు మార్లు జైలుకు వెళ్లి వచ్చిన అంశాలను పరిగణలోకి తీసుకుని 1994–16(2)(సి) నగరసభ చట్టం ప్రకారం రద్దు పరిచినట్లు తెలిపారు.
కలెక్టర్ పేరిట బురిడీ
●నకిలీ ఫేస్బుక్ ఖాతాతో వంచన
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లాధికారి నితీష్ పేరుతో దుండగుడు నకిలీ ఫేస్ బుక్ ఖాతాతో వంచన చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గతంలో కూడా సైబర్ నేరస్థులు పలు జిల్లాధికారుల నకిలీ ఫేస్బుక్ ఖాతాతో రూ.లక్షల్లో వంచన చేశారని, ఈ విషయంపై విచారణ చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ పుట్టమాదయ్య తెలిపారు.
హగరిలో ఇద్దరు బాలుర గల్లంతు
సాక్షి, బళ్లారి: వేదవతి(హగరి) నదిలో సరదాగా స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతైన ఘటన జరిగింది. బళ్లారి తాలూకా హగరి సమీపంలో ప్రవహిస్తున్న నదిలో హగరి గ్రామానికి చెందిన ఆంజనేయ, గోవిందప్ప అనే సోదరుల కుమారులు విష్ణుసాయి(14), కిరణ్ (16) అనే యువకులు ప్రమాదవశాత్తు ప్రవాహంలో కొట్టుకు పోయారు. ఈ ఘటన గ్రామంలో, కుటుంబ సభ్యుల్లో విషాదాన్ని నింపింది. పరమదేవనహళ్లి(హగరి) పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కార్యవర్గం ఎన్నిక
సాక్షి, బళ్లారి: జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా అవార్ మంజునాథ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో ప్రస్తుత అధ్యక్షుడు యశ్వంత్రాజ్ నాగిరెడ్డి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో అవార్ మంజునాథ్ను అధ్యక్షుడుగా, ఉపాధ్యక్షులుగా పాలన్న, దొడ్డనగౌడలను ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ తన పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తానన్నారు. ప్రముఖులు సురేష్బాబు, గిరిధర్, శ్రీనివాసరావు, దీపక్, గోవిందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
రాప్తాడు: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ ఓ వృక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్టాటక రాష్ట్రం రాయచూరు తాలూకా జాలిబెంచి గ్రామానికి చెందిన యువరాజ్(41) ఈనెల 3వ తేదీన ద్విచక్ర వాహనంలో బెంగళూరు నుంచి రాయచూరుకు బయలుదేరాడు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ప్రసన్నాయపల్లి రోడ్డు సమీపంలో లక్కీ 9 హోటల్ ముందు నిలబడిన ఉన్న కర్ణాటక ఆర్టీసీ బస్సును ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో యువరాజ్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరిస్థితి విషమించడంతో బళ్లారి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఘటనపై సీఐ టీ.వీ.శ్రీహర్ష కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బళ్లారి సమీపంలో ఉద్దేహాళ్ యువకుడి మృతి
బొమ్మనహాళ్: మండలంలోని ఉద్దేహాళ్ గ్రామానికి చెందిన తారమ్మ, నబీరసూల్ దంపతుల కుమారుడు ఆజీముద్దీన్ (26) బుధవారం బళ్లారి సమీపంలో చోటు చేసుకున్న ప్రమాదంలో మృతి చెందాడు. వ్యక్తిగత పనిపై ద్విచక్రవాహనంపై వెళుతున్న అతను.. బళ్లారి సమీపంలోని చరకుంటె గ్రామం వద్దకు చేరుకోగానే నియంత్రణ కోల్పోవడంతో వాహనం పొలాల్లోకి దూసుకెళ్లింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన అజీముద్దీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై బళ్లారి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
డిగ్రీ కళాశాలల్లో సంస్కృత పాఠాలు షురూ
డిగ్రీ కళాశాలల్లో సంస్కృత పాఠాలు షురూ
డిగ్రీ కళాశాలల్లో సంస్కృత పాఠాలు షురూ
డిగ్రీ కళాశాలల్లో సంస్కృత పాఠాలు షురూ
డిగ్రీ కళాశాలల్లో సంస్కృత పాఠాలు షురూ


