
రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలకు నిమిషాల్లో చేరుకోవచ్చు
బనశంకరి: రాష్ట్రంలో కరోనా విపత్తు తరువాత పర్యాటక రంగం మళ్లీ కుదుటపడింది. సమయం తక్కువగా ఉండి ముఖ్యమైన ప్రాంతాలను త్వరగా సందర్శించాలంటే విమానం, లేదా హెలికాప్టర్లో వెళ్లడమే శరణ్యం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలకు హెలికాప్టర్ సర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయి. హెలికాప్టర్ ఎక్కాలన్న సరదాతో పాటు చారిత్రక కట్టడాలను చూడాలన్న కోరిక నెరవేరుతుంది. ప్రపంచ వారసత్వ సంపదగా పేరుపొందిన హంపికి హెలికాప్టర్ సౌలభ్యం ఏర్పడింది. ప్రస్తుతం బెంగళూరు నుంచి కొడగు, చిక్కమగళూరు, హంపి, బాదామి, విజయపుర, కారవార తదితరాలకు హెలికాప్టర్లో విహారానికి వెళ్లి రావచ్చు.
మూడు సంస్థలు ఖరారు
ఇందుకోసం రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (కేఎస్ టీడీసీ) మూడు ఏవియేషన్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. కనీసం రూ.5 వేల నుంచి రూ.18 వేల ధరతో పర్యాటకులకు హెలికాప్టర్ సేవలు లభిస్తాయి. పర్యాటకశాఖ ఏడాది క్రితం ఆహ్వానించిన టెండరు ప్రక్రియకు 5 ఏజెన్సీలు దరఖాస్తులు వేయగా మూడు కంపెనీలను ఖరారుచేసింది. బెంగళూరు కెంపేగౌడ ఎయిర్పోర్టు నుంచి ఒక సంస్థ సర్వీసులు అందిస్తుంది. త్వరలోనే పూర్తిస్థాయిలో సర్వీసులు మొదలవుతాయని అధికారులు తెలిపారు. రాష్ట్ర పర్యాటక రంగానికి హెలిటూరిజం ఎంతో అనుకూలం కానుందని ఆ రంగ నిపుణులు పేర్కొన్నారు. హెలి ట్యాక్సీ లేదా హెలి టూరిజం సేవలు పొందడానికి ఆయా సంస్థల వెబ్సైట్ల ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు.