
తేలియాడే వంతెనపై లైఫ్ జాకెట్లతో పర్యాటకులు నీటిపై తేలియాడే రబ్బర్ వంతెన ఇదే
బనశంకరి: వేసవి నుంచి ఉపశమనం పొందడానికి చాలామంది హిల్స్టేషన్లు, మంచుకొండలు, చల్లటి ప్రదేశాలకు వెళుతుంటారు. మనసును, శరీరాన్ని కాస్త చల్లబరిచేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారికోసం కర్ణాటక ప్రభుత్వం ఓ సరికొత్త పర్యాటక ప్రాంతాన్ని ఏర్పాటు చేసింది. చాలామందికి సముద్రంలో తేలియాడాలని, అలలతో ఆడుకోవాలని ఉంటుంది. కానీ ఈత రాకపోవడం, సముద్రం అంటే ఉన్న భయంతో ఎవరూ అందులోకి దిగేందుకు సాహసం చేయలేరు. అలాంటి వారికోసం అద్భుత ఆలోచనతో ఓ బ్రిడ్జికి రూపకల్పన చేసింది కర్ణాటక పర్యాటకశాఖ. రాష్ట్రంలోనే తొలిసారిగా ఉడుపిలోని మల్పెబీచ్లో తేలియాడే వంతెన నిర్మించింది. ఉడుపిలో పర్యాటకుల రద్దీని పెంచేందుకు ఈ వంతెన అదనపు ఆకర్షణగా నిలుస్తోంది. రూ.80 లక్షల వ్యయంతో ఈ వంతెన ఏర్పాటుచేశారు. దీనిపొడవు 100 మీటర్లు, సందర్శకులు ఒక వ్యక్తి రూ.100 చెల్లించాలి. లైఫ్ జాకెట్ ధరించి ఈ వంతెనపై 15 నిమిషాలు పాటు నడవవచ్చు. సందర్శకుల భద్రత కోసం వంతెనపై 10 మంది లైఫ్గార్డులు, 30 లైఫ్బాయ్రింగులు ఉంటాయి. వంతెనపై ఉన్నప్పుడు, సందర్శకుల సముద్రపు అలలు కదలికల అనుభూతి పొందవచ్చు. వంతెనపై నడుస్తుంటే కెరటాల మీద స్వారీ చేసినట్లుగా ఉండటం దీని ప్రత్యేకత. మల్పెబీచ్ పర్యాటకులతో సందడిగా మారుతుంది. నిత్యం పర్యాటకులు సందర్శకులతో కళకళలాడుతుంది. మల్పెబీచ్లో సూర్యాస్తమయం నయనమనోహరమైన దృశ్యాలు వీక్షించడం ప్రత్యేక అనుభూతి కలిగిస్తుంది. బీచ్ చుట్టూ కొబ్బరిచెట్లు, ఇసుక తెన్నుల అందాలు ఎంతో అద్బుతంగా ఉంటుంది.
ఉడుపి మల్పె బీచ్లో రబ్బరు వంతెన
ఆకట్టుకుంటున్న తీరప్రాంతం
