
బనశంకరి: డబ్బులిస్తే ఎమ్మెల్యే సీటు ఇప్పిస్తామన్న స్కాంలో మూడో ఆరోపి ఉమ్మడి బళ్లారి జిల్లా హిరేహడగలి అభినవహాలశ్రీ స్వామిని మంగళవారం సీసీబీ పోలీసులు ఒడిశాలో అరెస్ట్చేశారు. ఉడుపి పారిశ్రామికవేత్త గోవిందబాబు పూజారికి బైందూరు నియోజకవర్గ బీజేపీ టికెట్ ఇప్పిస్తామని నమ్మించి చైత్రా కుందాపుర గ్యాంగ్ భారీగా డబ్బులు వసూలు చేసిన కేసులో ఈయన నిందితుడు. చైత్రా పట్టుబడినట్లు తెలియగానే ఆశ్రమం నుంచి కారు వేసుకుని పరారైనట్లు తెలిసింది. మూడురోజుల క్రితం ఆయన డ్రైవరు లింగరాజును అరెస్ట్చేసి విచారించగా కొన్ని విషయాలు తెలిశాయి.
హైదరాబాద్ నుంచి విమానంలో..
మొదట మైసూరుకు వెళ్లిన స్వామి అక్కడి నుంచి కారులో ఏపీ మీదుగా హైదరాబాద్ విమానాశ్రయానికి వెళ్లి విమానంలో ఒడిశాలోని కటక్ చేరుకున్నాడు. అక్కడ సాదా దుస్తులు ధరించి ఈశాన్య రాష్ట్రాలకు రైలులో వెళుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంటనే మధ్యాహ్నం 1.30 గంటలకు విమానంలో బెంగళూరుకు బయల్దేరారు. రాజరాజేశ్వరినగర సమీపంలోని కెంచేనహళ్లి ప్రీమియర్ టెంపుల్ బెల్స్ అపార్టుమెంట్లో హాలశ్రీ ఉంటున్నాడు. ఈయన విచారణ ద్వారా మరిన్ని అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.