ప్రతిరోజు వచ్చి గణితంలో చిట్కాలు నేర్చుకున్నా. కంప్యూటర్ పరిజ్ఞానంపై అవగాహన కల్పించారు. ఎలా రాస్తే హ్యాండ్రైటింగ్ బాగుంటుందో ఉపాధ్యాయులు నేర్పించారు. ఇలాంటి శిక్షణ ఇంకొద్ది రోజులు ఉంటే ఉంటే బాగుండేది.
అరాధ్యాయా, 8వ తరగతి
శిక్షణ ఎంతో ఉల్లాసంగా అనిపించింది. మళ్లీ వచ్చే వేసవిలో కూడా ఇలాగే శిక్షణ ఇవ్వాలి. చెస్, అబాకస్ నేర్చుకున్నాను. నా తోటి విద్యార్థులతో ఆడుతూపాడుతూ అన్ని అంశాల్లో శిక్షణ తీసుకోవడం బాగుంది. మంచిమంచి విషయాలు చెప్పారు.
– సాయిహర్ష, ఆరో తరగతి
ప్రతి వేసవిలో ఇలాంటి సమ్మర్క్యాంపులు నిర్వహిస్తే విద్యార్థులకు నైపుణ్యం పెరుగుతుంది. నేను తెలుగు హ్యాండ్రైటింగ్, కంప్యూటర్ విద్య, క్యారం, చెస్ మొదలైనవి నేర్చుకున్నాను. మంచిగా అనిపించింది. నాతోపాటు విద్యార్థులను తీసుకెళ్లా.
– మండలోజి అనన్య, 9వ తరగతి
వేసవి కాలంలో వివిధ రకాల్లో శిక్షణ విద్యార్థులకు ఇవ్వడం వలన వారిలోని ప్రతిభను వెలికి తీయవచ్చు. ఈ శిక్షణతో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. జ్ఞానం కూడా పెరుగుతుంది. స్కూల్ను ఎంపిక చేసినందుకు సంతోషంగా ఉంది.
– రాజన్న, పీఎంశ్రీ పాఠశాల హెచ్ఎం
ఇబ్రహీంపట్నం: పరీక్షలు ముగియగానే వేసవిలో ఎండలో తిరగకుండా.. చెరువులు, కుంటలు, కాలువల వైపు వెళ్లకుండా విద్యార్థులకు వేసవిశిక్షణ శిబిరాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇబ్రహీంపట్నంలోని పీఎంశ్రీ జెడ్పీ ఉన్నత పాఠశాలను ఎంపిక చేసి అందులోని 100 మంది ఆరో తరగతి నుంచి 9వ తరగతి పిల్లలకు ఈనెల 11 నుంచి 25 వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల దాకా ప్రతిరోజు శిక్షణ ఇచ్చారు. ఇందులో భాగంగా వారికి ఉచితంగా అల్పాహారం అందించారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచేలా లైవ్ స్కిల్స్, ఇండోర్ గేమ్స్, స్టోరీ టెల్లింగ్, కుట్లు, అల్లికలు, భాష ఉత్సవాలు, క్విజ్ పోటీలు, స్థానిక సంప్రదాయ ఆటల పోటీలు, కంప్యూటర్ పరిజ్ఞానం, చెస్, క్యారంలో తర్ఫీదు ఇచ్చారు. పిల్లలు కూడా ఉల్లాసంగా గడిపారు. మండలంలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో ఇలాంటి శిక్షణ శిబిరాలు నిర్వహించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.


