● మరణంలో వీడని బంధం
● కలిసి నడిచారు.. కలిసేపోయారు
ధర్మపురి: వారు కలిసి జీవితం పంచుకున్నారు. చివరకు కలిసే ఈ లోకా న్ని వీడారు. భర్త మరణించిన రోజే భార్య కూడా మృతిచెందిన ఘటన ధర్మపురి మండలం దోనూర్లో విషాదం నింపింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జంగం రాజయ్య, సాయ మ్మ దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు, కూతురు సంతానం. రాజయ్య వ్యవసాయం చేస్తుండేవాడు. వృద్ధాప్యం దరి చేరడం.. ఆరోగ్యం సహకరించకపోవడంతో ఇంటివద్దనే ఉంటున్నాడు. పెద్ద కుమారుడు ముంబయిలో ఉంటున్నాడు. ప్రస్తుతం దంపతులిద్దరూ చిన్న కుమారుడి వద్ద ఉంటున్నారు. శనివారం ఉదయం వరకు బాగానే ఉన్న రాజయ్య (83) శనివారం ఎండవేడి తట్టుకోలేక అస్వస్థతకు గురై మృతి చెందాడు. బంధువులు, కుటుంబ సభ్యులు రాజయ్యకు అంత్యక్రియలు పూర్తి చేసి బంధువులందరూ ఎక్కడివారక్కడ వెళ్లిపోయారు. ఈ క్రమంలో సాయమ్మ (80) రాత్రి భోజనం చేసిన అనంతరం ఛాతిలో నొప్పి వస్తోందంటూ కుప్పకూలిపోయింది. ఆదివారం ఉదయం బంధువులందరూ వచ్చి రాజయ్య చితిపక్కనే సాయమ్మకు అంత్యక్రియలు పూర్తిచేశారు. కలకాలం కలిసి ఉంటామని బాస చేసిన ఆ దంపతులు చివరకు కలిసే కానరాని లోకాలకు వెళ్లడంతో గ్రామంలో విషాదం అలుముకుంది.


