వేములవాడ: రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన ఆకుల నరేశ్ ఉరఫ్ దుబాయ్ నరేశ్(56) చార్ధామ్ యాత్రలో అస్వస్థతకు గురై ఆదివారం మృతిచెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు. వేములవాడలోని చెక్కపల్లిరోడ్డుకు చెందిన ఆకుల నరేశ్ కొన్నేళ్లుగా హైదరాబాద్లోని ముషీరాబాద్లో భార్య, ఇద్దరు కూతుళ్లతో కలిసి ఉంటున్నారు. ఇటీవల పెద్ద కూతురు పెళ్లి చేశారు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఆయన భార్య ఇటీవల స్వదేశం రావడంతో కుటుంబంతో కలిసి నాలుగు రోజుల క్రితం చార్ధామ్ యాత్రకు వెళ్లారు. ఆదివారం ఉదయం కేదారినాథ్ సమీపంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడంతో అత్యవసర చికిత్స నిమిత్తం ఛాపర్ అంబులెన్స్లో తరలించే లోపే మరణించారు. నరేశ్ మృతదేహాన్ని హైదరాబాద్కు తీసుకురానున్నారు. పట్టణంలోని ఆయన ఇంటిలో విషాద చాయలు అలుముకున్నాయి.


