కరీంనగర్: వైద్యరంగంలో అత్యాధునిక సాంకేతికతతో నిర్వహించే ఆర్థోపెడిక్ ఆర్థోస్కోపిక్ కీ హోల్ సర్జరీ ప్రదర్శనకు కరీంనగర్ వేదికై ంది. ఇండియన్ ఆర్థోస్కోపిక్ సొసైటీ జాయింట్ ప్రెజర్వేషన్ ప్రోగ్రాంలో భాగంగా ఆదివారం ఓ హోటల్లో సదస్సు నిర్వహించారు. రెనె ఆస్పత్రి లైవ్ శస్త్ర చికిత్సకు వేదికైంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆర్థోపెడిక్ నిపుణులు లైవ్ శస్త్రచికిత్సల్లో పాలుపంచుకున్నారు. శస్త్రచికిత్సలను సీఎంఈ ప్రోగ్రాం ద్వారా లైవ్టెలికాస్ట్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్స్, పీజీ వైద్య విద్యార్థులు హాజరయ్యారు. వైద్యులు సాయి వీర్ల, నితిన్కుమార్ బెజ్జంకి, పూర్ణచంద్ర తేజస్వి, రమాకాంత్ రాజగోపాల్ కృష్ణన్, సుఖేష్ రావు శస్త్ర చికిత్స నిర్వహించారు. ఆర్గనైజింగ్ చైర్మన్ బంగారు స్వామి మాట్లాడుతూ.. గతంలో ఇలాంటి శస్త్రచికిత్సలు ఢిల్లీ, ముంబయి, బెంగళూరు వంటి నగరాల్లో మాత్రమే జరిగేవని, నేటి వైద్య విద్యార్థులకు కరీంనగర్ వంటి కేంద్రాల్లో కూడా అంతర్జాతీయ స్థాయి వైద్యసదస్సులు నిర్వహించడం ద్వారా మంచి జ్ఞానాన్ని పెంపొందించుకునే అవకాశం దొరికిందన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామ్ కుమార్రెడ్డి, సెక్రటరీ జగన్మోహన్ రెడ్డి, ఆర్థోస్కోపిక్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ జైప్రసాద్ పెద్ది, శ్రీధర్ గంగవరపు, మునీష్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


