కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో నివసిస్తున్న ఇతర రాష్ట్రాలవారిపై పోలీసులు దృష్టి సారించారు. ఇక్కడ జీవనోపాధి పొందుతున్న వలస కార్మికుల వివరాలు సేకరిస్తున్నారు. సీపీ గౌస్ఆలం ఆదేశాలతో కొత్తపల్లి పోలీసులు మండలంలోని గ్రానైట్ కటింగ్, పాలీషింగ్ ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న కార్మికుల వివరాలు సేకరించే ప్రక్రియకు శనివారం శ్రీకారం చుట్టారు. కరీంనగర్లో ఇటీవల జరిగిన పీఎంజే జువెల్లరీ దొంగతనం, హైదరాబాద్లో నేపాల్ గ్యాంగ్ చేసిన హత్యలు, దొంగతనాల నేపథ్యంలో గ్రానైట్ క్వారీలు, కటింగ్, పాలీషింగ్ యూనిట్లు, అనుబంధ వ్యాపారాలు, హోటళ్లు, లాడ్జీలు తదితర రంగాల్లో పనిచేస్తున్న వారి వివరాలు సేకరిస్తున్నారు.
పారిశ్రామిక ప్రాంతంలో వేలాది మంది కార్మికులు
కొత్తపల్లి మండలంలోని పారిశ్రామిక ప్రాంతమైన ఆసిఫ్నగర్, ఖాజీపూర్, ఎలగందుల, నాగులమల్యాల, కమాన్పూర్, బద్దిపల్లి ప్రాంతాల్లోని గ్రానైట్ పరిశ్రమల్లో వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నా రు. ఈ పారిశ్రామిక ప్రాంతంలో రాజస్థాన్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, చత్తీస్గఢ్, మహారాష్ట్ర, బిహార్, అసోం, జార్ఖండ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు నేపాల్కు చెందిన కార్మికులు ఉపాధి పొందుతున్నారు. అయితే ఎవ రు వస్తున్నారో..ఎవరు నివసిస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. పోలీసుల వద్ద ఎలాంటి సమాచారం లేకపోవడంతో నేర పరిశోధన చేపట్టలేకపోతున్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని కార్మి కుల జాబితా తయారు చేయాలని నిర్ణయించారు.
వేగవంతమైన నేర పరిశోధనకు
శాంతిభద్రతల పరిరక్షణకు ఇతర రాష్ట్రాల కార్మి కుల వివరాల నమోదు ప్రక్రియ చేపట్టాం. నేరాల నియంత్రణ, అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన స్పందనకు దోహదంగా ఉంటుంది. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇతర రాష్ట్రాల కార్మికుల వ్యక్తిగత వివరాలు, నివాస చిరునామాలు, ఉపాధి వివరాలను సేకరించి ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి.
– సోహం సునీల్, ట్రైనీ ఐపీఎస్


