కొత్తపల్లి: కొత్తపల్లి మండలం చింతకుంట శాంతినగర్ వద్ద గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పూల వ్యాపారి ఎండీ మోయినుద్దీన్(28) దుర్మరణం చెందాడు. శాంతినగర్లో కుటుంబంతో నివాసం ఉంటూ కరీంనగర్లో పూల వ్యాపారం చేసుకుంటున్న మొయినుద్దీన్ పని ముగించుకుని రాత్రి 12:30 గంటలకు తన ద్విచక్రవాహనంపై శాంతినగర్ వెళ్తున్నాడు. చింతకుంట సమీపంలో కొత్తపల్లి పోలీసులు గ్రానైట్ లారీలను తనిఖీ చేస్తుండగా, బైక్ ముందు వెళ్తున్న లారీని హఠాత్తుగా డ్రైవర్ ఆపాడు. ఆ లారీని వెనుక నుంచి ఎండీ మోయినుద్దీన్ ఢీకొట్టడంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని కొత్తపల్లి పోలీసులు తెలిపారు.
అప్పుల బాధతో రియల్టర్ ఆత్మహత్య
కరీంనగర్రూరల్: రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టపోయి, అప్పులపాలైన ఓ రియల్టర్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్రూరల్ సీఐ నిరంజన్రెడ్డి కథనం ప్రకారం. నగరంలోని ఆదర్శనగర్కు చెందిన గంగిశెట్టి లక్ష్మణ్(60) రియల్ ఎస్టేట్ వ్యాపారంతోపాటు ప్రైవేట్గా చిట్టీలు నిర్వహించేవాడు. వ్యాపారంలో నష్టపోయి, అప్పు ఇచ్చిన వాళ్లు డబ్బులు అడుగుతుండటంతో గురువారం సాయంత్రం ఇంటినుంచి వెళ్లిపోయాడు. రాత్రివరకు భార్య వినోదకు ఓ వ్యక్తి ఫోన్ చేసి తీగలగుట్టపల్లి రైల్వేస్టేషన్ సమీపంలోని చెట్టుకు లక్ష్మణ్ ఉరివేసుకున్నట్లు తెలిపాడు. వెంటనే అక్కడికి చేరుకున్న కుటుంబసభ్యులు లక్ష్మణ్ మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తన భర్త లక్ష్మణ్ అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడని భార్య వినోద శుక్రవారం ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నిరంజన్రెడ్డి తెలిపారు.


