తోటకు నీరుపెట్టేందుకు వెళ్లి.. | - | Sakshi
Sakshi News home page

తోటకు నీరుపెట్టేందుకు వెళ్లి..

May 21 2026 12:14 AM | Updated on May 21 2026 12:14 AM

గుండెపోటుతో ఒకరి..

విద్యుత్‌ వైరు తగిలి రైతు మృతి

ధర్మపురి: తోట రక్షణగా ఏర్పాటు చేసిన కరెంట్‌ వైరే రైతు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ ఘటన ధర్మపురి సమీపంలోని కొరండ్లపల్లెలో విషాదం నింపింది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ధర్మపురికి చెందిన కటుకం శంకర్‌ (54) తనుకున్న భూమిలో పెసర, బీర, మిరప సాగు చేస్తున్నాడు. పందులు, ఇతర వన్యప్రాణులు రాకుండా రక్షణగా కంచె ఏర్పాటు చేశాడు. బుధవారం మధ్యాహ్నం తోటకు నీరు పెట్టడానికి వెళ్లాడు. కంచెకు 11 కేవీ మెయిన్‌ వైరు తగులుకుని ఉంది. దీనిని గమనించని శంకర్‌ నీరు పారిస్తుండగా.. కంచెకున్న విద్యుత్‌ వైరు తగిలి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. శంకర్‌ సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తోటవద్దకెళ్లి చూడగా విగతజీవిగా కనిపించాడు. ఎస్సై మహేశ్‌ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. శంకర్‌ వ్యవసాయపనులతోపాటు బీడీ కంపెనీలో పనిచేస్తున్నాడు. గ్రామంలో బీజేపీ నాయకుడిగా కొనసాగుతున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

కొడిమ్యాల: మండలంలోని నల్లగొండ గ్రామానికి చెందిన కొలపూరి సురేశ్‌ (39) గుండెపోటుతోనే చనిపోయినట్లు పోస్టుమార్టంలో తేలింది. సురేశ్‌ తండ్రి రాజయ్య, ఎస్సై సందీప్‌ కథనం ప్రకారం.. రాజయ్య పెద్ద కుమారుడు సురేష్‌ మంగళవారం సాయంత్రం పొలం వద్ద కొంతసేపు ఉంటానని, ఆవు పాలు పితికి తీసుకొస్తానని తండ్రికి చెప్పాడు. సురేశ్‌ అదే గ్రామంలో అద్దె ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. రాత్రి ఇంటికి చేరుకున్నాడని తండ్రి భావించాడు. బుధవారం ఉదయం పొలం వద్దకు వెళ్లగా సురేష్‌ విగతజీవిగా కనిపించాడు. నుదిటిపై, కుడి కాలి వేళ్ల వద్ద గాయాలు కనిపించడంతో కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఎస్సై సంఘటన స్థలానికి చేరుకుని అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశారు. మృతదేహాన్ని జగిత్యాల ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం చేయించారు. ఇందులో అక్కడి వైద్యులు గుండెపోటు కారణంగానే సురేశ్‌ మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

రైలు ఢీకొని వ్యక్తి ..

రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వేస్టేషన్‌లో బుధవారం రైలు ఢీకొని వ్యక్తి(55) మృతి చెందాడు. ఒకటో నంబరు ప్లాట్‌ఫారం దిగి రెండోనంబరు ప్లాట్‌ఫారంపైకి పట్టాలపైనుంచి వెళ్తుండగా రప్తిసాగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఢీకొంది. వ్యక్తి శరీరం రెండు ముక్కలైంది. నల్లనిప్యాంట్‌, తెల్లని బనియన్‌ ధరించి ఉన్నాడు. ఈనెల 18న తీసుకున్న ఝార్సీగూడ–సికింద్రాబాద్‌ రైలు టికెట్‌ లభ్యమైంది. ఇతర ఆధారాలేమీ లభ్యం కాలేదు. మృతదేహాన్ని గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీలో భద్రపరిచామని జీఆర్పీ ఔట్‌పోస్టు ఇన్‌చార్జి తిరుపతి తెలిపారు. మృతుడి బంధువులు 99493 04574, 87126 58604 నంబర్లకు సమాచారం అందించాలని ఆయన కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement