● రైస్మిల్లు యజమానిపై కేసు
తంగళ్లపల్లి(సిరిసిల్ల): ప్రభుత్వానికి అప్పగించాల్సిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎమ్మార్) విషయంలో భారీ అవకతవకలకు పాల్పడిన మానేర్ రైస్ మిల్లు యజమానిపై తంగళ్లపల్లి పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఖరీఫ్ 2024–2025 సీజన్కు సంబంధించి చీర్లవంచలోని మానేర్ రైస్ మిల్లుకు ప్రభుత్వం 2,964.480 మెట్రిక్ టన్నుల ధాన్యం కేటాయించింది. నిబంధనల ప్రకారం మిల్లు యజమాని 1984.192 టన్నుల బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉండగా, కేవలం 515.375 టన్నులు మాత్రమే ఇచ్చారు. మిగిలిన నిల్వలపై సివిల్ సప్లయ్ అధికారులు తనిఖీ చేయగా దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మిల్లులో ఉండాల్సిన బియ్యం నిల్వలు ఏమీ లేవు. బకాయి ఉన్న బియ్యానికి సమానమైన ధాన్యం (2,192.263 టన్నులు) ఉండాలి, కానీ కేవలం 718.760 టన్నులు మాత్రమే అందుబాటులో ఉంది. దాదాపు 1,473.503 టన్నుల ప్రభుత్వ ధాన్యం మిల్లులో తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దుర్వినియోగం చేసిన ఈ ధాన్యం విలువ జరిమానాతో కలిపి సుమారు రూ.3,41,85,270 ఉంటుందని అధికారులు నిర్ధారించారు. ప్రభుత్వ ధాన్యాన్ని సొంతానికి వాడుకున్నందుకు సివిల్ సప్లయ్ జిల్లా మేనేజర్ నరసింహ ఫిర్యాదుతో మిల్లు యజమాని దుండ్రుపల్లి జమునపై కేసు నమోదు చేశారు. సిరిసిల్ల డీఎస్పీ కె.నాగేంద్రచారి సంఘటన స్థలాన్ని శనివారం సందర్శించి విచారణ చేపట్టారు. ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.


