ప్రత్యేక అలంకరణలో స్వామివారు
మాల విరమణ చేస్తున్న భక్తులు
మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయంలో హనుమాన్ చిన్న జయంతి వేడుకలు శుక్రవారం ముగిశాయి. మూడు రోజుల ఉత్సవాల్లో భాగంగా గురువారం అర్ధరాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం వరకు దీక్షాపరులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఇరుముడులు సమర్పించి దీక్ష విరమణ చేశారు. ఆలయ పరిసరాలన్నీ కాషాయమవగా, జై శ్రీరామ్, జై హనుమాన్ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. మూలవిరాట్కు ఫల, పంచామృతాభిషేకం చేసి పూలతో అలంకరించారు. స్వామి వారి ఉత్సవ మూర్తిని ఊరేగింపుగా ఆలయ ప్రవేశం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామి వారిని దర్శించుకొని మాల విరమణ చేసి తలనీలాలు సమర్పించి అంజన్నా.. సల్లంగా సూడు.. మళ్లొస్తాం.. అంటూ స్వస్థలాలకు తిరుగుపయనమయ్యారు.
సుమారు 3లక్షల మంది రాక..
హనుమాన్ చిన్న జయంతి పురస్కరించుకొని కొండగట్టుకు మూడు రోజుల్లో సుమారు 3లక్షల మందికి పైగా స్వామి వారిని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. కలెక్టర్ బి.సత్యప్రసాద్, ఎస్పీ అశోక్కుమార్, ఆర్డీవో మధుసూదన్, ఆలయ ఈవో అంజనారెడ్డిలు హనుమాన్ దీక్షాపరులకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకున్నారు.


