తంగళ్లపల్లి(సిరిసిల్ల): భార్య కాపురానికి రావ డం లేదని భర్త ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూర్లో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్ తెలిపిన వివరాలు. కందికట్కూర్కు చెందిన న్యాలం రమేశ్(32) భార్య ఆరు నెలల గర్భవతి భర్తతో గొడవ పడి పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి రమేశ్ తన ఇంట్లోని ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం కుటుంబ సభ్యులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుడికి రెండెళ్ల కూతురు ఉంది. మృతుని సోదరుడు రాజేశం ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కడుపునొప్పి భరించలేక ఎలబోతారం సర్పంచ్ భార్య..
● గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన భర్త
కరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం ఎలబోతారం గ్రామ సర్పంచ్ తప్పెట్ల రాజు భార్య సౌజన్య(25) కడుపు నొప్పి భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మృతిని తట్టుకోలేక భర్త గుండెపోటుతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. కరీంనగర్రూరల్ సీఐ నిరంజన్రెడ్డి కథనం మేరకు.. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా గెలిచిన తప్పెట్ల రాజు చెర్లభూత్కూర్కు చెందిన సౌజన్యను 8 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొన్ని నెలలుగా కడుపు నొప్పితో బాధపడుతున్న సౌజన్య మందులు వాడినా తగ్గలేదు. బుధవారం రాత్రి ఇంట్లో సౌజన్య చున్నీతో ఉరేసుకోగా.. గమనించిన సోదరుడు శ్రీనివాస్ వెంటనే రాజుకు సమాచారమందించాడు. ఉరి తొలగించి చికిత్స నిమిత్తం సౌజన్యను ప్రతిమ ఆస్పత్రికి తరలించగా.. సీరియస్గా ఉండడంతో కరీంనగర్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. భార్య మృతిచెందడంతో గుండెపోటుతో కుప్పకూలిపోయిన రాజును వెంటనే చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. గురువారం సాయంత్రం సౌజన్య మృతదేహాన్ని ఎలబోతారం తీసుకురాగా.. కూతురు ఫ్లెమీ(6), కొడుకు డేనీ(4) మమ్మీ మమ్మీ అంటూ రోదించడంతో స్థానికులు కంటతడి పెట్టారు. భార్య అంత్యక్రియల్లో సర్పంచ్ రాజు ఆస్పత్రి నుంచి వచ్చి పాల్గొన్నాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
మహిళ ఆత్మహత్య
గంగాధర: మధురానగర్ గ్రామానికి చెందిన దూస లత(45) తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు. కొద్దికాలంగా ఆమెకు మానసికస్థితి బాగోలేదు. దీంతోపాటు అనారోగ్యంతో బాధ పడుతోంది. పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నా కుదుటపడలేదు. బుధవారం సాయంత్రం వరకు బాగానే ఉన్నా.. గురువారం ఉదయం తన గది తలుపులు తీయలేదు. ఆమె భర్త తలుపులు పగులగొట్టి చూసేసరికి ఉరివేసుకుని కనిపించింది. భర్త శంకరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు ఎస్సై వివరించారు.


