కరీంనగర్: కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో తన పేరు చెప్పి ఎవరైనా కబ్జాలు, అక్రమ దందాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలుంటాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ హెచ్చరించారు. ఎవరైనా తన పేరు చెప్పుకొని అక్రమ దందాలు చేస్తూ పంచాయితీలు, సెటిల్మెంట్ల పేరుతో ఇబ్బంది పెడితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. బండి సంజయ్ మీడియాకు ప్రకటన విడుదల చేశారు. కొత్తగా ఎన్నికై న ప్రజాప్రతినిధులు సైతం అట్లాంటి పైరవీకారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలకు నిరంతరం సేవ చేస్తూ పార్టీకి మంచి పేరు తెచ్చేలా పని చేసేవారిని ప్రోత్సహిస్తానని, అదే సమయంలో ప్రజలను ఇబ్బంది పెడితే మాత్రం ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇకపై తన పేరు చెబుతూ ఇబ్బంది పెడితే.. వెంటనే తన ఎంపీ కార్యాలయ సిబ్బంది దృష్టికి తీసుకురావాలని కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలను కోరారు.


