అకాలవర్షం అన్నదాతను ఆందోళనకు గురి చేస్తోంది. చేతికందివచ్చిన పంట చేనులోనే నేలరాలుతుండటంతో కన్నీటిపర్యంతమవుతున్నారు. సోమవారం, మంగళవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో వీణవంక, గన్నేరువరం, కరీంనగర్రూరల్, హుజూరాబాద్, చొప్పదండి, రామడుగు, గంగాధర మండలాల్లో పంటనష్టం వాటిల్లింది. గన్నేరువరం మండల కేంద్రంతో పాటు మాదాపూర్, ఖాసీంపేట, పారువెల్ల గ్రామాలు, వీణవంక మండల కేంద్రంతో పాటు పోతిరెడ్డిపల్లి, రెడ్డిపల్లి, కొండపాక, కరీంనగర్ రూరల్ మండలంలో బొమ్మకల్ గ్రామాల్లో మొక్కజొన్న పంట 227 ఎకరాల్లో దెబ్బతిందని వ్యవసాయ అధికారులు ప్రాథఽమికంగా అంచనా వేశారు. గంగాధర, రామడుగు మండలాల్లో మామిడికాయలు నేలరాలాయి. 139 మంది రైతులు పంట నష్టపోయారని జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి వివరించారు. కొత్తపల్లిలో విద్యుత్ తీగలపై చెట్ల కొమ్మలు పడి కరెంట్ సరఫరా నిలిచింది. విద్యానగర్ సాలంపురలో నాలుగు స్తంభాలు, గన్నేరువరంలోని పలు గ్రామాల్లో ఆరు స్తంభాలు విరిగిపడ్డాయి. కరీంనగర్ మండలం చెర్లభూత్కూర్, మొగ్ధుంపూర్, చామనపల్లి, నగునూరు తదితర గ్రామాల్లో వరిపంట నేలకొరిగింది.
– కరీంనగర్అర్బన్/కరీంనగర్ రూరల్/హుజూరాబాద్/చొప్పదండి/ కొత్తపల్లి/రామడుగు/గంగాధర/గన్నేరువరం
అకాలవర్షంతో అన్నదాత ఆగమాగం
మొక్కజొన్న పంట నష్టం 227 ఎకరాలు
నష్టపోయిన రైతుల సంఖ్య 139


