● సీపీ గౌస్ ఆలం
కరీంనగర్క్రైం: రోడ్డు నిబంధనలు పాటించి ప్రమాదాలకు చెక్ పెట్టవచ్చని సీపీ గౌస్ ఆలం సూచించారు. సోమవారం కమిషనరేట్లోని అస్త్ర కన్వెన్షన్ హాల్లో ఆటో డ్రైవర్లు, రాపిడో కెప్టెన్ల కోసం ఏర్పాటు చేసిన ఆరైవ్– ఆలైవ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గతేడాది కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాలతో 200 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. హెల్మెట్, సీట్బెల్ట్ ధరించకపోవడం, అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం వంటి అజాగ్రత్తల వల్లే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని తెలిపారు. ఒకవ్యక్తి మరణం ఆ కుటుంబం మొత్తాన్ని వీధిన పడేస్తుందని గుర్తు చేశారు. కరీంనగర్– హైదరాబాద్, వరంగల్– జగిత్యాల, సిరిసిల్ల, చొప్పదండి వెళ్లే రహదారుల్లో ‘బ్లాక్ స్పాట్లను’ గుర్తించామని, అక్కడ ప్రత్యేక నిఘాతో పాటు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. హుజూరాబాద్ పరిధిలోని లింగాపూర్ క్రాస్రోడ్డు వద్ద ఇప్పటికే సైన్ బోర్డులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ట్రాఫిక్ ఏసీపీ యాదగిరి స్వామి, సీఐలు సంజీవ్, కుమారస్వామి, కిరణ్ కుమార్, రాపిడో అసోసియేట్ మేనేజర్ దుర్గారావు పాల్గొన్నారు.


