రుద్రంగి: రుద్రంగి ప్రాంతంలో అటవీ ఆక్రమణలు జోరుగా సాగుతున్నాయి. ఫారెస్ట్ అధికారుల అండదండలతోనే ఇదంతా జరుగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పదుల సంఖ్యలో జేసీబీలు, ట్రాక్టర్బ్లేడు బండ్లు పెట్టి ఇష్టం వచ్చినట్లు అటవీని ధ్వంసం చేస్తున్నారు. ఇదంతా అధికారుల కళ్ల ఎదుటే జరుగుతున్నా పట్టించుకోకుండా ఫారెస్టు అధికారులు చోద్యం చూస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా ఫారెస్టు అధికారులు నిద్రమత్తు వీడి విలువైన అటవీ సంపదను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయంపై ఫారెస్టు బీట్ ఆఫీసర్ బాలకృష్ణను వివరణ కోరగా ఫారెస్టును ఆక్రమిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నామన్నారు. ఉన్నతాధికారులకు విన్నవించినా ఫలితం శూన్యం గతంలో రుద్రంగి మండలంలో స్థానిక అధికారుల అండదండలతో ఇష్టానుసారంగా ఫారెస్టు ఆక్రమణలపై మానాల గ్రామస్తులు కలెక్టరేట్ వరకు వెళ్లి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేదని మానాల గ్రామస్తులతో పాటు రుద్రంగి మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.
చోద్యం చూస్తున్న అటవీ అధికారులు
ఉన్నతాధికారులకు విన్నవించినా ఫలితం శూన్యం


