ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మానసిక, శారీరక వికాసం సాధించేందుకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయి. పాఠశాల స్థాయిలో క్రీడలపై శ్రద్ధ చూపుతున్న విద్యాశాఖ కళాశాల స్థాయిలో పట్టింపు కరువైంది. విద్యార్థులు స్కూల్ లెవల్లో వివిధ పోటీల్లో పాల్గొన్న వారు ఇంటర్కు వచ్చేసరికి శిక్షకులు లేక నైపుణ్యం కరువైంది. క్రీడలపై ఆసక్తి ఉన్న విద్యార్థులు సైతం శిక్షణకు దూరమై వివిధ పోటీల్లో పాల్గొనలేకపోతున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలో రెండు డిగ్రీ, పది ఇంటర్ ప్రభుత్వ కాలేజీలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా అగ్రహారం డిగ్రీ కాలేజీలో మినహా ఎక్కడ కూడా పీడీ(ఫిజికల్ డైరెక్టర్)లు లేరు. దీంతో విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు.
లెక్చరర్లతోనే శిక్షణ
ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ ఇచ్చేందుకు ఇటీవల ప్రభుత్వం ఒక్కో కాలేజీకి రూ.10వేలు కేటాయించింది. ఈ నిధులతో క్రీడా సామగ్రిని సైతం కొనుగోలు చేశారు. కానీ విద్యార్థులకు ఆటలపై పట్టు సాధించేలా శిక్షణ ఇచ్చే పీడీలు లేరు. దీంతో కాలేజీలోని వివిధ సబ్జెక్టుల అధ్యాపకులే ప్రతీ శనివారం సాయంత్రం శిక్షణ ఇస్తున్నారు. వీరి శిక్షణలో విద్యార్థులు పెద్దగా ఆటలపై పట్టు సాధించడం లేదు. దీంతో వీరు ఏ క్రీడా పోటీల్లో పాల్గొనడం లేదు. ఒకవేళ పాల్గొన్న పతకాలు రావడం లేదు. ఇదే సమయంలో గురుకులాల్లో ప్రత్యేక శిక్షకులు ఉండడంతో అక్కడ చదువుకుంటున్న విద్యార్థులు నిత్యం సాధన చేస్తూ వివిధ క్రీడావిభాగాల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. వారికి ఉన్నత విద్యలో స్పోర్ట్స్ విభాగంలో రిజర్వేషన్లు వర్తిస్తున్నాయి. క్రీడాకోటాలో చాలా మంది విద్యార్థులు ఉద్యోగాలు సైతం సాధించారు. గురుకుల విద్యార్థులకు క్రీడలతో లబ్ధి జరుగుతుండగా ప్రభు త్వ జూనియర్, డిగ్రీ కాలేజీల్లో చదువుతున్న పేద విద్యార్థులకు మాత్రం ఆ ఫలితాలు దక్కడం లేదు.
జిల్లాలో పీడీలు కరువు
విద్యార్థులకు అందని క్రీడాశిక్షణ
క్రీడాసామగ్రికి నిధులు.. శిక్షకులు కరువు
జిల్లాలో 10 జూనియర్, రెండు డిగ్రీ కళాశాలలు
ఆటలకు దూరంగా విద్యార్థులు


