ఎమ్మెల్యే గంగులపై రెండు కేసులు నమోదు
కరీంగనర్క్రైం: కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా జరిగిన వేర్వేరు ఘటనల్లో త్రీటౌన్ పరిధిలో మూడు కేసులు నమోదు కాగా ఇందులో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్పై రెండు కేసులు ఫైల్ అయినట్లు సీపీ గౌస్ ఆలం తెలిపారు. సీపీ వివరాల ప్రకారం నగరంలోని కిసాన్నగర్లో లోకిని జంపయ్య నుంచి రూ.47వేలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు పోలీసుస్టేషన్కు తరలిస్తుండగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జోక్యం చేసుకొని, విధులకు ఆటంకం కలిగించారని, పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిని బలవంతంగా విడిపించుకుని వెళ్లి శాంతి భద్రతలకు విఘాతం కలిగించారన్నారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే గంగులతో పాటు కుర్ర తిరుపతి, ఎడ్ల అశోక్, అమరగొండ అశోక్, ఎడ్ల సరిత, బెజుగం మధుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అదే ప్రదేశంలో సమావేశం నిర్వహించి ఓట్లు వేయాలని ఎమ్మెల్యే గంగుల కోరారని, ఈ ఘటనలో గంగులతో పాటు ఎడ్ల అశోక్, కుర్ర తిరుపతిలపై మరో కేసు నమోదు చేశామన్నారు. కుర్ర తిరుపతి వద్ద రూ.44,500 నగదు పట్టుబడగా కేసు నమోదు చేసినట్లు సీపీ తెలిపారు.


