సిటీకి రూపాయి తెచ్చావా..?
నిరూపిస్తే ముల్లేమూట సర్దుకుని పోతా
రేకుర్తి భూములపై పోరాటం చేస్తా
కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కరీంనగర్టౌన్/కొత్తపల్లి: కేంద్ర మంత్రి బండి సంజయ్ రెండున్నరేళ్లలో రూపాయి బిల్ల కేంద్రం నుంచి తెచ్చినట్లు జీవో చూపిస్తే ముల్లేమూట సర్దుకుని పోతా అని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సవాల్ విసిరారు. శనివారం నగరంలోని 19,20,30,32,38,62 డివిజన్లలో బీఆర్ఎస్ అభ్యర్థులు రాజశేఖర్, సుదగోని మాధవి కృష్ణగౌడ్, మేచినేని అశోక్రావు, కలకొండ జ్యోత్న, నక్కపద్మ, బోయినపల్లి శ్రీనివాస్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటా తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్నర్ మీటింగ్లో మాట్లాడుతూ.. స్మార్ట్సిటీ తీసుకువచ్చిన అని చెప్పుకునే ఎంపీ బండి సంజయ్ బబీజేపీ కార్పొరేటర్ ఉన్న డివిజన్లలో ఎందుకు రోడ్లు వేయలేదో సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ప్రజలను మోసం చేస్తోందన్నారు. రేకుర్తిలోని నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లు పునరుద్ధరించకుంటే పోరాటం తప్పదని హెచ్చరించారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే రేకుర్తి భూములపై సెక్రటేరియట్ వరకు పాదయాత్ర చేస్తానని హామీ ఇచ్చారు. నగరంలో మేయర్ పీఠాన్ని గులాబీ పార్టీ కై వసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, నాయకులు అక్బర్ హుసేన్, మధుకర్, మల్లారెడ్డి, గంటల రేణుక, కె.సుధాకర్, ప్రభాకర్, రవీందర్రావు, సంపత్రావు, పవన్ పాల్గొన్నారు.


