రచ్చబండ రాజకీయాలు
బోయినపల్లి(చొప్పదండి): పంచాయతీ ఎన్నికలతో పల్లెల్లో రాజకీయ వేడి రగిలింది. నలుగురు కలిస్తే చాలు ఎన్నికల ముచ్చట్లే పెడుతున్నారు. అభ్యర్థుల గెలుపోటములపై చర్చలు సాగుతున్నాయి. రాజన్నసిరిసిల్ల జిల్లాలో 260 గ్రామాల్లో సర్పంచు పదవులకు, 2,268 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి. హోటళ్లలో చాయ్ తాగుతూ.. చౌరస్తాలో నలుగురు కలిసిన చోట సర్పంచ్ ఎవరైతే కరెక్ట్.. ఏ వార్డులో ఎవరూ పోటీచేస్తున్నారనే చర్చలే సాగుతున్నాయి.
అరుగులే..రచ్చబండలు
ఒకప్పుడు గ్రామాల్లోని ప్రధాన కూడళ్లలో రచ్చబండలు ఉండేవి. గ్రామంలోని పెద్దమనుషులు(వయసురీత్య) ఒక్క చోట చేరి కుసల సమాచారం చేరవేసుకునేవారు. కాలక్రమంలో రచ్చబండలు కనుమరుగయ్యాయి. ఇళ్ల ముందు కట్టుకున్న అరుగులపై కూర్చుంటున్న ఒకే వయసు వారు ఎన్నికలపై చర్చలు పెడుతున్నారు. ఏ అభ్యర్థి ఎట్లుంటడు.. గ్రామాభివృద్ధికి ఏం చేస్తడు... తదితర అంశాలపై జోరుగా ముచ్చట్లు పెడుతున్నారు. సర్పంచ్ అభ్యర్థుల గుణగణాలు లెక్కిస్తున్నారు. గ్రామానికి ఎవరు సర్పంచ్ అయితే లాభం జరుగుతది అనే ముచ్చట్లు పెడుతున్నారు. ఉదయం, సాయంత్రం ఇళ్ల వద్ద అరుగుల(రచ్చబండలు)పై రాజకీయ ముచ్చట్లు నడుస్తున్నాయి. తామ కులపోడు గెలుస్తాడని ఒకరంటే.. ఏ లేదు.. లేదు మా పార్టీ బలపరిచిన అభ్యర్థే గెలుస్తాడని మరొకరు.. ఏహే.. వీళ్లెవలు కాదు పలాన వ్యక్తికి మంచి ఫాలోయింగ్ ఉందని ఆయన్నే గెలుస్తాడంట అని మాటల తూటాలు పేల్చుతున్నారు. చివరికి మనకెందుకే లొల్లి.. పోలింగ్ నాడు సూసుకుందాం.. తియ్ అనుకుంటూ ఎవరింటికి వాళ్లు వెళ్లిపోతున్నారు.
ప్రధాన కూడళ్ల వద్ద పెరిగిన రాజకీయ ముచ్చట్లు
నలుగురు కూడితే ఎన్నికల ముచ్చట్లే
గ్రామాల్లో ఇళ్ల ముందు అరుగులపై ముచ్చట్లు


