‘ఉపాధి’ పేరిట నిలువు దోపిడీ
జగిత్యాలక్రైం: ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లే వారి సంఖ్య జిల్లాలో రెండేళ్లుగా పెరిగిపోతోంది. దీనిని అదునుగా తీసుకుంటున్న కొంతమంది ఏజెంట్లు గల్ఫ్ దేశాలకు పంపిస్తామంటూ వారి నుంచి రూ.లక్షలు తీసుకుని తప్పించుకు తిరుగుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా జిల్లాలో సుమారు 120 ట్రావెల్స్లు కొనసాగుతున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగులకు విదేశీల్లో ఉపాధి కల్పిస్తామని ఆశచూపి.. అందినంతా దండుకుని మోసాలకు పాల్పడుతున్నారు. వాస్తవానికి వీరు విమాన టికెట్స్ బుకింగ్ చేసేందుకే అనుమతి తీసుకొని నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని చెప్పి పాస్పోర్టులు తీసుకుని.. ఇంటర్వ్యూలకు హాజరుపరుస్తూ.. వీసా వచ్చిందని నమ్మిస్తూ.. డబ్బులు వసూలు చేస్తున్నారు. అదే ట్రావెల్స్లో ఎలాంటి అనుమతులు లేకుండా మనీ ట్రాన్స్ఫర్ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. నిరుద్యోగులు కూడా వీరిని గుడ్డిగా నమ్మి మోసపోతున్నారు.
35 మందికే లైసెన్స్
జిల్లాలో గల్ఫ్ పంపించేందుకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ నుంచి కేవలం 35 మంది ఏజెంట్లు మాత్రమే లైసెన్స్లు తీసుకున్నారు. మిగతా వారంతా అనుమతి లేకుండానే ట్రావెల్స్ నిర్వహిస్తున్నారు. ఏజెంట్లుగా చలామణి అవుతూ నిరుద్యోగులను వీసాల పేరుతో మోసం చేస్తున్నారు.
లైసెన్స్ లేకున్నా ఇంటర్వ్యూలు
గల్ఫ్ ఏజెంట్లు, ట్రావెల్స్ నిర్వాహకులు లైసెన్స్లు ఉన్నప్పటికీ ఎస్బీ (స్పెషల్ బ్రాంచ్) పోలీసులకు సమాచారం అందించాకే ఇంటర్వ్యూలు నిర్వహించాలి. కానీ నిర్వాహకులు పోలీసులకు సమాచారం లేకుండానే బహిరంగంగానే పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. నిరుద్యోగులను ఇంటర్వ్యూలకు పిలిపించి పాస్పోర్టులు తీసుకుంటున్నారు. అనంతరం వారికి ఏదో ఒక వీసా అప్పగిస్తున్నారు. యూరప్ దేశాల్లో ఉద్యోగాలున్నాయని సుమారు రూ.నాలుగు లక్షల నుంచి రూ.6 లక్షల వరకు వసూలు చేస్తున్నారు.


