
పారదర్శక పాలనే లక్ష్యం
కరీంనగర్ అర్బన్: ప్రభుత్వశాఖల్లో పారదర్శక పాలన అందించేందుకే సమాచార హక్కు చట్టం రూపొందించారని అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ అన్నారు. సమాచార హక్కు చట్టం– 2005 అమల్లోకి వచ్చి 20ఏళ్లు అవుతున్న నేపథ్యంలో ఈనెల 5 నుంచి 12వ తేదీ వరకు వారోత్సవాల్లో భాగంగా జిల్లాస్థాయి అవగాహన కార్యక్రమాన్ని కలెక్టరేట్లో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ లక్ష్మికిరణ్ మాట్లాడుతూ 2005లో అమల్లోకి వచ్చిన సమాచార హక్కు చట్టంతో పాలనలో పారదర్శకత పెరిగిందన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలు కోరే సమాచారాన్ని అందించడంలో పీఐవో, ఏపీవోల బాధ్యత కలిగి ఉంటారని, వారు చట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. సమాచార హక్కు చట్టం–2005లోని అంశాలు, ఆర్టీఐ దరఖాస్తు విధానం, దరఖాస్తుల స్వీకరణ, దరఖాస్తు ఫీజు, దరఖాస్తుదారుకు ఇవ్వాల్సిన సమాచారం, పీఐవో, ఏపీఐవోల బాధ్యతలు, తదితర అంశాలపై సమాచార హక్కు చట్టం రిసోర్స్ పర్సన్ జి.కిషన్ అధికారులు, పీఐవో, ఏపీఐవోలకు క్షుణ్ణంగా వివరించారు. సమాచార హక్కు చట్టాన్ని పారదర్శకంగా అమలు చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కిరణ్ ప్రకాశ్, ఏవో గడ్డం సుధాకర్, కరీంనగర్ ప్రాంతీయ శిక్షణ కేంద్రం కోఆర్డినేటర్ రాంబాబు, ఈడీఎం శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.