జెడ్పీ పీఠాలపై కాషాయ జెండా ఎగరేస్తాం | - | Sakshi
Sakshi News home page

జెడ్పీ పీఠాలపై కాషాయ జెండా ఎగరేస్తాం

Oct 4 2025 2:14 AM | Updated on Oct 4 2025 2:14 AM

జెడ్పీ పీఠాలపై    కాషాయ జెండా ఎగరేస్తాం

జెడ్పీ పీఠాలపై కాషాయ జెండా ఎగరేస్తాం

● కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ ● బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం

● కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌

కరీంనగర్‌టౌన్‌: కరీంనగర్‌, సిరిసిల్ల జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పీఠాలను బీజేపీ కై వసం చేసుకోబోతోందని, సర్వే నివేదికలు ఇదే విషయం తేటతెల్లం చేస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ అన్నారు. శుక్రవారం సాయంత్రం కరీంనగర్‌లోని ఈఎన్‌ గార్డెన్స్‌లో కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని మండలాధ్యక్షులు, జెడ్పీటీసీ ప్రభారీల సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన బండి సంజయ్‌ మాట్లాడుతూ... కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలను ఎప్పుడెప్పుడు ఓడిద్దామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని, తాను సైతం ఎన్నికలు ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. తాజామాజీ సర్పంచులు, రైతులు, మహిళలు, వృద్ధులు, నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగులే ఈసారి కాంగ్రెస్‌ ను ఓడించబోతున్నారని, బీజేపీకి వాళ్లే బ్రాండ్‌ అంబాసిడర్లు కాబోతున్నారన్నారు. అభ్యర్థులకు టిక్కెట్ల కేటాయింపు విషయాన్ని బీజేపీ రాష్ట్ర నాయకత్వం చూసుకుంటుందని, ఇప్పటికే సర్వేలు చేయిస్తోందని తెలిపారు. సర్వే నివేదికలను బట్టి గెలుపే ప్రాతిపదికన టిక్కెట్లు వస్తాయని స్పష్టం చేశారు. కరీంనగర్‌, సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, రెడ్డబోయిన గోపి, మాజీ అధ్యక్షులు బాస సత్యనారాయణ, మాజీ మేయర్లు సునీల్‌రావు, డి.శంకర్‌, పార్లమెంట్‌ కన్వీనర్‌ బోయినపల్లి ప్రవీణ్‌ రావు, కోమాల అంజనేయులు, వాసాల రమేశ్‌ పాల్గొన్నారు.

అన్ని పార్టీలు కోర్టుకు అఫిడవిట్లు ఇవ్వాలి

కరీంనగర్‌ కార్పొరేషన్‌: బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు అనుకూలంగా అన్ని రాజకీయ పార్టీలు కోర్టుకు అఫిడవిట్లు ఇవ్వాలని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. అసెంబ్లీలో బలహీనవర్గాల బిల్లుకు అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపినందున, అదే విషయాన్ని కోర్టుకు కూడా చెప్పాలన్నారు. దసరా సందర్భంగా గురువారం కరీంనగర్‌లో మాట్లాడారు. గత ప్రభుత్వం 2018లో 50 శాతం పరిమితితో రిజర్వేషన్‌చట్టం తీసుకువచ్చిందన్నారు. తమ ప్రభుత్వం 50శాతం రిజర్వేషన్‌ పరిమితిని ఎత్తివేస్తూ ప్రత్యేక చట్టంచేసి గవర్నర్‌కు పంపించామని తెలిపారు. ఏ కారణం చేతనే గవర్నర్‌ దానిని ఆమోదించలేదన్నారు. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్‌ల పెంపునకు ఆమోదించిన అన్ని పార్టీలు, ఇదే అంశాన్ని కోర్టుకు తెలిపాలని సూచించారు. రాష్ట్రం నుంచి ఎనిమిది బీజేపీ ఎంపీలున్నారని బీసీ బిల్లు ఆమోదానికి కృషి చేయాలన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్‌లపై తాము ఎక్కడా నిరసన తెలపడం లేదంటున్నారన్నారు. ఒకవైపు అలుముకుంటూనే కడుపులో కత్తులు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌లపై రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, న్యాయపరమైన అంశాలపై ముందుకు వెళ్లిందన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్‌ ద్వారా దేశానికే తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణగౌడ్‌, నాయకులు వైద్యుల అంజన్‌కుమార్‌, పడిశెట్టి భూమయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement