నిన్న హత్య.. నేడు అంత్యక్రియలు | - | Sakshi
Sakshi News home page

నిన్న హత్య.. నేడు అంత్యక్రియలు

Mar 17 2025 11:10 AM | Updated on Mar 17 2025 11:03 AM

మానవత్వం చాటిన పోలీసులు కుటుంబ సమక్షంలో కమలాకర్‌ దహనసంస్కారాలు

జగిత్యాలక్రైం: క్షణికావేశంలో ఇంటిపెద్దను భార్య, కొడుకులు, కూతురు, అల్లుడు హత్య చేశారు. క్షణికావేశం నుంచి తేరుకున్నాక తండ్రి మరణాన్ని తట్టుకోలేక కొడుకులు, కూతురు కన్నీరుమున్నీరయ్యారు. స్థానికుల వివరాలు.. జగిత్యాల రూరల్‌ మండలం పొలాస గ్రామానికి చెందిన పడాల కమలాకర్‌ (58)పై మొదటి భార్య జమున, పెద్ద కొడుకు చిరంజీవి, చిన్న కొడుకు రంజిత్‌, కూతురు శిరీష, అల్లుడు శోభన్‌ కలిసి క్షణికావేశంలో పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. దీంతో చికిత్స పొందుతూ కమలాకర్‌ మృతిచెందగా అతడి బంధువులు, గ్రామస్తులు మృతదేహాన్ని చూసేందుకు కూడా ఎవరూ రాలేదు. దీంతో ఆదివారం కొంత మంది సన్నిహితుల మధ్య పోలీసులు పోస్టుమార్టం పూర్తి చేయించి మృతదేహాన్ని పొలాసకు తరలించారు. దీంతో హత్యలో ప్రమేయం ఉన్న వారంతా పోలీస్‌స్టేషన్‌లో ఉండటంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో మానవత్వం చాటిన పోలీసులు ప్రత్యేక పోలీసు బందోబస్తు మధ్య మొదటి భార్య జమున, కొడుకులు చిరంజీవి, రంజిత్‌, కుమార్తె శిరీష, అల్లుడు శోభన్‌ను పొలాసకు తీసుకెళ్లారు. దీంతో వారంతా కమలాకర్‌ మృతదేహంపై పడి రోదించడంతో స్థానికులు, బంధువులు పెద్ద ఎత్తున తరలివచ్చి కన్నీరుమున్నీరయ్యారు. తండ్రి చితికి నిప్పంటించాడు. అంత్యక్రియల అనంతరం నిందితులను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు.

మృతుడి ఇంట్లో ఆయుధాలు

కుటుంబ సభ్యుల చేతిలో హత్యకు గురైన పడాల కమలాకర్‌ ఇంట్లో ఆదివారం పోలీసులు పరిశీలించగా భారీ ఆయుధాలు లభ్యమయ్యాయి. తల్వార్లతో పాటు కత్తులు, రాడ్లు కన్పించడంతో పోలీసులు బిత్తరపోయారు. కమలాకర్‌ పక్కా ప్రణాళికతోనే కొన్నేళ్లుగా మారణాయుధాలు వెంట ఉంచుకుంటూ తిరిగాడని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.

నిందితుల రిమాండ్‌

జగిత్యాల రూరల్‌ మండలం పొలాస గ్రామానికి చెందిన పడాల కమలాకర్‌ (58)పై పెట్రోల్‌ పోసి నిప్పంటించి మృతికి కారణమైన ఐదుగురిని ఆది వారం రిమాండ్‌కు తరలించినట్లు సీఐ కృష్ణారెడ్డి తెలి పారు. కుటుంబ కలహాలతో మొదటి భార్య జమున, పెద్ద కొడుకు చిరంజీవి, చిన్న కొడుకు రంజిత్‌, కుమార్తె శిరిష, అల్లుడు శోభన్‌బాబు కలిసి కమలాకర్‌పై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందగా అతడి సోదరుడు రవి ఫిర్యాదు మేరకు ఐదుగురిపై కేసు నమోదయింది. సమావేశంలో రూరల్‌ ఎస్సై సధాకర్‌ పాల్గొన్నారు.

నిన్న హత్య.. నేడు అంత్యక్రియలు1
1/1

నిన్న హత్య.. నేడు అంత్యక్రియలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement