
పలకరించిన తొలకరి.. జాగ్రత్తే అన్నదాత విధి
● జిల్లా అంతటా వర్షాలు ● జాగ్రత్తలు తీసుకోకుంటే నష్టాలే మరి ● రసీదులు భద్రపర్చండి
కరీంనగర్ అర్బన్: తొలకరి ఈ సారి ముందుగానే పలకరించింది. చిరుజల్లులతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలో ప్రధానంగా వరి, పత్తి, కంది, పెసలు, అంతర పంటల సాగుకు చర్యలు తీసుకుంటున్నారు. కరీంనగర్, చొప్పదండి, మానకొండూర్, హుజూరాబాద్ వ్యవసాయ డివిజన్లలో విత్తనాల కొనుగోలు షురువైంది. రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న దళారులు మార్కెట్లోకి నకిలీ విత్తనాలు తీసుకొస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిషేఽధించిన బీజీ–3 విత్తనాలను బీజీ–2 పేరుతో విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వం రాయితీపై వరి, పత్తి, కంది తదితర విత్తనాలను సరఫరా చేస్తోంది. అరకొర అందడంతో కొంతమంది వ్యాపారులు పలు గ్రామాల్లో కమీషన్ ఎరగా చూపి నకిలీ విత్తనాలు అంటగడుతున్నారు. మహారాష్ట్ర, గుంటూరు తదితర ప్రాంతాల నుంచి తెచ్చి అన్నదాతను నిండా ముంచుతున్నారు. ఈ నేపథ్యంలో విత్తనాలపై రైతులు అవగాహన కలిగి ఉండాలని, లైసెన్స్డ్ వ్యాపారుల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
దోపిడీకి దళారుల సిద్ధం
జిల్లాలో మూడు లక్షల ఎకరాలకు పైగా పంటలు సాగవనుండగా ప్రధానంగా వరి తరువాత పత్తి సాగుచేయనున్నారు. సేద్యానికి సిద్ధమైన రైతన్నకు నకిలీ విత్తనాలు ముప్పు పొంచి ఉంది. అన్నదాత అవసరాలు, అమాయకత్వాన్ని సొమ్ము చేసుకునేందుకు కొందరు మాయగాళ్లు నకిలీ, కల్తీ విత్తనాలు అంటగట్టి రైతులను నిండా ముంచి జేబులు నింపుకునేందుకు సిద్ధపడుతున్నారు. రైతులపై కొత్త కొత్త ప్రయోగాలు చేసేందుకు పలు విత్తన కంపెనీలు సైతం రంగంలోకి దిగాయి. బీజీ–3 విత్తనాలను బీజీ–2 పేరుతో విక్రయించి సొమ్ము చేసుకునే దందాకు కొందరు వ్యాపారులు తెరలేపుతున్నారు. కేంద్రం నిషేధించిన బీజీ–3 విత్తనాలను కొందరు అక్రమార్కులు ఇప్పటికే గ్రామాలకు తరలించినట్లు తెలుస్తోంది. విత్తనాలు కొనుగోలు చేయడమే తప్ప వాటి స్థితిగతులను గమనించకపోవడంతో రైతన్నలు ఏటా నష్టాలబారిన పడుతున్నారు.
పురుగు మందుల విషయంలో..
● వ్యవసాయ శాఖ సూచించిన పురుగు మందులను అవసరమైన మేరకు మాత్రమే కొనుగోలు చేయాలి.
● లేబుల్ లేని మందుసీసా, డబ్బా, ప్యాకెట్లను కొనరాదు. ప్రకటించిన మందు పేరు, రూపం, మందుశాతం, పరిమాణం, జాగ్రత్తలు, విరుగుడు మందులు, బ్యాచ్ నంబర్లు, వాడాల్సిన గడువు, తయారుచేసిన సంస్థ పేరు, రిజిస్ట్రేషన్ విషయాలను పరిశీలించాలి.
● తప్పనిసరిగా అన్ని వివరాలతో బిల్లును పొందాలి.
● సీళ్లు సరిగా లేని మందులను కొనరాదు. లైసెన్సు లేని డీలర్లు, సస్యరక్షణ మందులను విక్రయిస్తుంటే సమీప వ్యవసాయ అధికారులకు తెలియజేయాలి.
ఎరువుల కొనుగోలులో..
● ఎరువుల కొనుగోలుకు సరైన బిల్లు పొందడంతో పాటు డీలర్ బుక్కులో రైతు సంతకం చేయాలి.
● మిషన్ కుట్టు ఉన్న ఎరువు సంచులను మాత్రమే కొనుగోలు చేయాలి. చేతికుట్టయితే వాటిపై సీసంతో వేసిన సీల్ ఉందో లేదో చూడాలి.
● బస్తాపై ప్రామాణిక పోషకాలు, ఉత్పత్తిదారుని వివరాలు ఉండాలి.
● ఎరువుల విషయంలో అనుమానం వస్తే వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందించాలి. అనుమానం ఉన్న ఎరువుల నమూనాలను రూ.10 డీడీ జత చేసి పరీక్షలకు పంపించాలి.
ఈ సూచనలు పాటించండి
ముందస్తుగా విత్తనాలు మొలకెత్తే శాతాన్ని ప్యాకెట్పై చూసుకుని కొనుగోలు చేసి పంట పొలాల్లో విత్తుకోవాలి. పంటను విత్తిన తరువాత తప్పనిసరిగా విత్తన ప్యాకెట్లను, రసీదులను భద్రపరచుకోవాలి.
సరిగా సీల్ చేసి ధ్రువీకరణ పత్రం ఉన్న బస్తాల్లోని విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలి.
బస్తాపై రకం, పేరు, లాట్నంబర్, గడువు తేదీ పేర్కొనేలా డీలర్ సంతకం తీసుకోవాలి. తన సంతకం కూడా బిల్లుపై ఉండేలా చూసుకోవాలి.
కొనుగోలు బిల్లుపై నంబర్, విత్తన రకం, గడువు తేది పేర్కొనేలా డీలర్ సంతకం తీసుకోవాలి. తన సంతకం కూడా బిల్లుపై ఉండేలా చూసుకోవాలి.
ప్రయివేటు సంస్థల ప్రచారాలకు ఆకర్షితులు కాకపోవడమే కాకుండా వ్యవసాయ శాఖ అధికారి, శాస్త్రవేత్తలు సూచించిన విత్తనాలు మాత్రమే కొనుగోలు చేస్తే ప్రయోజనకరం.
రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ధ్రువీకరించిన విత్తనాల కొనుగోలు సమయంలో బస్తాపై నీలివర్ణం ట్యాగు ఉందో లేదో గమనించాలి.
హైబ్రిడ్ విత్తనం కొనుగోలు చేసేటప్పుడు విత్తన సంచి పైనున్న పసుపు రంగు ట్యాగ్, దానిపై విత్తనం భౌతిక స్వచ్ఛత, మొలకెత్తే శాతం, జన్యునాణ్యత వంటి వివరాలు పరిశీలించాలి.