కామారెడ్డి టౌన్ : ఆధిపత్య పోరులో మున్సిపల్ అభివృద్ధి కుంటుపడుతోందని మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కాసర్ల గోదావరి, బీఆర్ఎస్ కౌన్సిలర్లు ..ఎమ్మెల్యే కేవీఆర్, మున్సిపల్ చైర్పర్సన్ భర్తనుద్దేశించి వ్యాఖ్యానించారు. మంగళవారం జిల్లా కేంద్రంలో వారు మాట్లాడారు. మున్సిపాలిటీలో నిధులు లేనప్పుడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమావేశం ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లు లేకుండా ఎమ్మెల్యే అధికారులతో విడిగా సమీక్షా సమావేశం నిర్వహించడం మున్సిపల్ చట్టాలకు వ్యతిరేకమన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ భర్త కౌన్సిల్ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ, కమిషనర్తో పాటు, ఇతర అధికారులు, సిబ్బందిపై పెత్తనం చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలన్నారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లు మహ్మద్ హఫీజ్, కుంబాల రవి, మన్సూర్, ఎజాజ్, మామిళ్ల లక్ష్మణ్, గరిగంటి స్వప్న, లోలం శ్రీనివాస్, గోపు బాలమణి తదితరులు పాల్గొన్నారు.


