సాక్షి ప్రతినిధి, నిజామాబాద్/కామారెడ్డి టౌన్ : ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)తో అర్హుల ఓట్లు పోకుండా చూస్తామని, అవసరమైతే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్లో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి నివాసంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పార్టీ అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జులతో కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఎస్ఐఆర్ నేపథ్యంలో పార్టీ తరఫున నియమించిన బూత్ లెవల్ ఏజెంట్ల సహకారంతో ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడుతామన్నారు. గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారి ఓటు హక్కును కాపాడేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపడతామన్నారు. ఇప్పటికే వందలమంది ఎన్ఆర్ఐలు ఫోన్లు చేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో జాతీయ ఎన్నికల సంఘాన్ని కలుస్తామని కేటీఆర్ తెలిపారు. ఇందుకు పార్టీ తరఫున ఒక సీనియర్ ప్రతినిధి, నాయకుల ప్రతినిధి బృందాన్ని, ఎమ్మెల్యేలు, ఎంపీల బృందాన్ని ఢిల్లీకి పంపనున్నట్లు తెలిపారు. పార్టీ బూత్ లెవెల్ అసిస్టెంట్లు గల్ఫ్ ఎన్ఆర్ఐల వివరాలు సేకరించి, వారి ఓటు హక్కును తొలగించకుండా సమన్వయం చేయాలన్నారు. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ఇన్చార్జులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా చేపట్టాల్సిన కార్యాచరణను కేటీఆర్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నాయకులకు వివరించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఆయా నియోజకవర్గాల్లోని స్థితిగతులను నాయకులు కేటీఆర్కు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, మోసాలతో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, తిరిగి కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని తమ అభిప్రాయాలు తెలిపారు. సమావేశంలో మాజీ ఎంపీ సురేశ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు హన్మంత్ సింధే, జాజాల సురేందర్, జీవన్రెడ్డి, బిగాల గణేశ్ గుప్తా, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, నాయకులు ముజీబొద్దీన్, ఆయేషా పాల్గొన్నారు.
బూత్ లెవెల్ అసిస్టెంట్లతో గల్ఫ్
ఎన్ఆర్ఐల వివరాల సేకరణ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఉమ్మడి జిల్లా పార్టీ నాయకులతో
సమీక్ష సమావేశం


