● గుడిమేట్ మహాదేవ పీఠాధిపతి మహాదేవ స్వామీజీ
కామారెడ్డి టౌన్ : దేశాన్ని, హిందూ సంస్కృతిని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని గుడిమేట్లోని మహాదేవ ధర్మపీఠం అధిపతి సద్గురు మహాదేవ స్వామీజీ పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో అంబేడ్కర్ బస్తీ హిందూ సమ్మేళనాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. హైందవ సంక్షేమమే భారత సంక్షేమమన్నారు. మనమంతా హిందువులమనే ఐక్యతా భావనను గుండెల్లో నింపుకుని జీవించినప్పుడే దేశాన్ని, సంస్కతిని, పురాతన దేవాలయాలను కాపాడుకోగలమన్నారు. భావితరాలకు సనాతన ధర్మ విశిష్టతను తెలియజేసేందుకు హిందూ సమ్మేళనాలు దోహదపడతాయన్నారు. అనంతరం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ఇందూర్ విభాగ్ కళాశాల విద్యార్థి ప్రముఖ్ ఉల్లెంగ ముత్యం, హిందూ సమ్మేళన సమితి ప్రతినిధులు శ్రీనివాస్, గోపీకృష్ణ, సునీల్, కౌన్సిలర్లు గెరిగంటి స్వప్న, తోట వంశీకృష్ణ, పిట్ల వేణుగోపాల్, గంట మధుకృష్ణ, గోపు బాలమణి తదితరులు పాల్గొన్నారు.


