● అపార్ట్మెంట్లోని
తాళం వేసిన ఇంట్లో..
● 40 తులాల బంగారం,
60 తులాల వెండి అపహరణ
కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలోని విద్యానగర్ కాలనీ జన్మభూమి రోడ్డులో ఉన్న శ్రీ సాయి అపార్ట్మెంట్లో తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ జరిగింది. వివరాలిలా ఉన్నాయి. అపార్ట్మెంట్లో నివాసం ఉండే బాలకృష్ణ రాజంపేట ఎంపీడీవోగా పనిచేస్తున్నారు. ఆయన తన కుటుంబంతో కలిసి ఆస్పత్రి పనిమీద శనివారం సాయంత్రం ఫ్లాట్కు తాళం వేసి హైదరాబాద్ వెళ్లారు. దొంగలు తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఆదివారం ఉదయం దీనిని గమనించిన వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పట్టణ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ జరిపారు. శుభకార్యాల సీజన్ కావడంతో బంగారు ఆభరణాలను ఇంట్లోనే ఉంచుకున్నట్లు తెలుస్తోంది. 40 తులాల బంగారం, 60 తులాల వెండి, రూ.లక్ష నగదు చోరీకి గురైనట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్టీం బృందాలు వివరాలు సేకరించాయి. పోలీసులు అపార్ట్మెంట్, పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పట్టణ ఎస్హెచ్వో నరహరి తెలిపారు.


