నిజామాబాద్ రూరల్: నగరంలోని విశ్వవికాస్ హైస్కూల్లో ఆదివారం ‘పేరిణి నాట్య ప్రవేశిక లెవెల్స్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయి. బోర్డు ఫర్ ప్రమోషన్ భారత్ కల్చర్ అండ్ ట్రెడీషనల్ ఆర్ట్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చరల్ గవర్నమెంట్ అఫ్ తెలంగాణ, నటరాజ కళాకృష్ణ నృత్య జ్యోతి అకాడమీ ఆధ్వర్యంలో ఈ పరీక్షలను ఏర్పాటు చేశారు. పరీక్షలకు పేరిణి నాట్య గురువు తోట ప్రశాంత్, శ్రీ సమ్మోహన నాట్యాలయం వ్యవస్థాపకులు నట్టువంగం సహకరించారు. చతరాజు నవ్యజ, పేరిణి నాట్య అధ్యాపకురాలు ‘విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల, హన్మకొండ’కు చెందిన యాజమాన్యం పరీక్షలను నిర్వహించారు. వినాయక నగర్, అర్సపల్లి, డిచ్పల్లి, నారాయణ్ఖేడ్ సహా తదితర ప్రాంతాల నుంచి సుమారు 60 మంది ఈ పరీక్షలలో పాల్గొన్నారు. గజ్జెల రంజిత్ కుమార్ వరంగల్ చీఫ్ ఎక్సామినర్గా విధులు నిర్వహించారు. పల్నాటి శ్రీజ, బండారి వైష్ణవి, పేరిణి నాట్య బోధకులు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
వేల్పూర్: ప్రస్తుత కాలంలో ప్రతి మనిషికి ఆధ్యాత్మిక శిక్షణ ఎంతో అవసరమని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మండలంలోని మండలం మోతె గ్రామానికి చెందిన అల్లపుల్ల గంగారెడ్డి తన తండ్రి రాజులు స్మృతిలో సంపాదకత్వం వహించి రూపొందించిన ‘లోపలిదారి’ పుస్తకాన్ని ఈటల రాజేందర్ ఆదివారం హైదరాబాద్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను చదివిన సైఫాబాద్ సైన్స్ కాలేజీ పూర్వ విద్యార్థి గంగారెడ్డి ఆధ్యాత్మిక పుస్తకానికి సంపాదకత్వం వహించి పబ్లిష్ చేయడం, దానిని తాను ఆవిష్కరించడం ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. మోతకు చెందిన గంగారెడ్డి తన తండ్రి స్మారకార్థం గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు రూ. 10 లక్షలు విరాళం ప్రకటించిన విషయం విదితమే. కార్యక్రమంలో నాగరాజు, గంగారెడ్డి, రమేశ్, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
నిజామాబాద్ రూరల్: గంజాయి సేవించిన ముగ్గురు యువకులకు కౌన్సెలింగ్ నిర్వహించినట్లు రూరల్ ఎస్సై షరీఫ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. రెండు రోజుల క్రితం ఖానాపూర్ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు గంజాయి సేవించిన్నట్లు నిర్ధారణ అయ్యిందన్నారు. వీరిని ఆదివారం మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పర్చగా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని డీ అడిక్షన్ సెంటర్కు తరలించి పరీక్షలు చేయడం జరిగిందని ఎస్సై తెలిపారు. గంజాయిని పంపించడానికి, దురాలవాట్లను దూరం చేయడానికి డీ అడిక్షన్ సెంటర్లకు యువకులను తరలించినట్లు పేర్కొన్నారు.


