● కలెక్టర్ చొరవతో కుటుంబాన్ని కలుసుకున్న వైనం
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి పట్టణంలో రోడ్ల వెంట తిరుగుతున్న మానసిక వైకల్యంగల వ్యక్తి 25 ఏళ్ల తర్వాత తన కుటుంబాన్ని కలుసుకున్నారు. పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తి (50) మానసిక వైకల్యంతో రోడ్ల వెంబడి తిరుగుతున్న విషయం ఇటీవల కలెక్టర్ ఆశిష్సంగ్వాన్ దృష్టికి వచ్చింది. వెంటనే ఆయన స్పందించి జిల్లా సంక్షేమాధికారులను ఆదేశించడంతో శనివారం అతన్ని వృద్ధాశ్రమానికి తరలించి వైద్యసేవలు, ఆహారం అందించారు. తాను జగిత్యాల జిల్లాకు చెందిన వాడినని చెప్పడంతో అతని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కుటుంబసభ్యులు కామారెడ్డికి రాగా, అధికారులు అతడిని అప్పగించారు. 25ఏళ్ల తర్వాత తమ కుటుంబ సభ్యుడిని కలుసుకోవడం ఆనందంగా ఉందని వారు పేర్కొన్నారు. కలెక్టర్, జిల్లా సంక్షేమాధికారులకు ధన్యవాదాలు తెలిపారు. కాగా కలెక్టర్ ఆదేశం ప్రకారం మానసిక వైలక్యం వ్యక్తి వివరాలు, కుటుంబసభ్యుల వివరాలు గోప్యంగా ఉంచారు.
● మద్యం మత్తులో వ్యక్తి వీరంగం ● కానిస్టేబుల్ దాడిలో గాయపడ్డ వైనం
నిజాంసాగర్(జుక్కల్): మల్లూర్లో శనివారం జరిగిన కుస్తీ పోటీల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మద్యంమత్తులో ఓ వ్యక్తి కుస్తీపోటీల్లో తలపడటానికి రాగా, కానిస్టేబుల్ అడ్డుచెప్పినా వినకపోవడంతో లాఠీతో కొట్టారు. దీంతో అతడు గాయపడ్డి స్పృహ కోల్పోగా, గ్రామస్తులు కానిస్టేబుల్పై దాడికి యత్నించారు. వివరాలు..ఒడ్డేపల్లికి చెందిన పోతరాజు మైశయ్య చిత్తుగా మద్యం సేవించి కుస్తీ పట్టేందుకు మల్లూర్కు వచ్చాడు. అక్కడే విధుల్లో ఉన్న కానిస్టేబుల్ బాల్రాజ్ అడ్డు చెప్పినా మైశయ్య వినిపించుకోలేదు. కుస్తీ పోటీలకు ఆటంకం కల్గకుండా మైశయ్యను పక్కకు తోసే క్రమంలో తోపులాట జరగడంతో వ్యక్తిని కానిస్టేబుల్ లాఠీతో కొట్టాడు. ఈ ఘటనలో అతడికి రక్తస్రావం కావడంతో స్పృహతప్పి కిందపడ్డాడు. దీంతో ఇరు గ్రామాల ప్రజలు కానిస్టేబుల్ను చుట్టుముట్టి దాడికి యత్నించారు. విషయం తెలుసుకున్న ఎస్సై శివకుమార్ ఘటన స్థలానికి చేరుకొని జాగ్రత్తలు చేపట్టారు. గాయపడిన వ్యక్తిని ఎల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. ఇరు గ్రామాల ప్రజలు, నాయకులతో చర్చించారు. ఎస్సై శివకుమార్ను వివరణ కోరగా.. కానిస్టేబుల్ పక్కకు తోసివేసిన సమయంలో కర్రపై పడటంతో ఆ వ్యక్తికి రక్తస్రావమైనట్లు చెప్పారు. మద్యం సేవించిన మైశయ్యతోపాటు పో లీసు విధులకు ఆటంకం కల్గించిన వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.


