క్రైం కార్నర్
కాలువలో పడి బాలుడి మృతి
బోధన్: ప్రమాదవశాత్తు కాలువలో పడి ఓ బాలుడు మృతి చెందిన ఘటన ఎడపల్లి మండలం జానకంపేటలో చోటు చేసుకుంది. ఎడపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జానకంపేట గ్రామానికి చెందిన హఫీజ్(4) శుక్రవారం సాయంత్రం గ్రామ సమీపంలో ఉన్న నిజాంసాగర్ కాలువ ప్రాంతానికి స్థానిక పిల్లలతో కలిసి ఆడుకునేందుకు వెళ్లి తిరిగి రాలేదు. ప్రమాదవశాత్తు కాలువ నీటిలో పడి కొట్టుకుపోయాడు. కుటుంబీకులు గాలించినా బాలుడి ఆచూకీ దొరకలేదు. శనివారం నవీపేట మండలం అబ్బాపూర్ శివారులోని నిజాంసాగర్ కాలువలో బాలుడి మృతదేహం లభ్యమైంది. బాలుడి తండ్రి షేక్ అఫ్జల్ ఫిర్యాదు మేరకు ఎడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
మోపాల్: కాల్పోల్ తండాలో శనివారం ఉదయం ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఎస్సై జాడె సుస్మిత కథనం ప్రకారం.. సర్పంచ్ మెగవత్ రవిని కించపరుస్తూ కొంతకాలంగా బస్సీ శ్రీకాంత్, బస్సీ జనార్దన్, బస్సీ శ్రీరామ్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. శుక్రవారం కూడా బూతుమాటలతో వాయిస్ మెసేజ్ పెట్టారు. ఇదే విషయాన్ని రవి నిలదీయగా, ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈక్రమంలో బస్సీ శ్రీకాంత్ కుటుంబ సభ్యులు బస్సీ మంగూరామ్,లచ్చి, బిక్యా లక్ష్మి, మరికొందరు కలిసి రవిపై కట్టెలతో దాడికి పాల్పడ్డారు. రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అదేవిధంగా మేకపిల్ల విషయంలో తన త మ్ముడు బస్సీ జనార్దన్ను సర్పంచ్ రవి, మరికొంద రు అడ్డుకుని దూషించడమే కాకుండా భౌతిక దాడి కి పాల్పడ్డారని బస్సీ శ్రీకాంత్ ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పరస్పర ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఎస్సై కౌంటర్ కేసు నమోదు చేశారు.
క్రైం కార్నర్


